భారత్- పాకిస్థాన్ మధ్య 'బాస్మతి బియ్యం' వార్.. నెగ్గిందెవరు..?
అంతర్జాతీయ మార్కెట్ లో భారతీయ బియ్యానికి ఆదరణ పెరగడంతో పొరుగు దేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. భారత్ అందిస్తున్న సరసమైన ధరల కారణంగా గ్లోబల్ మార్కెట్ లో పాక్ ఎగుమతిదారులు కొత్త ఆర్డర్లను సాధించలేక వెనుకబడిపోతున్నారు. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ దేశ ఆహార రంగానికి సంబంధించిన అంతర్జాతీయ లావాదేవీల వాటా భారీగా తగ్గిపోయింది.
పాకిస్థాన్ పార్లమెంటరీ వాణిజ్య కమిటీ సమావేశంలో ఆ దేశ సెక్రటరీ జవాద్ పాల్ మాట్లాడుతూ.. భారత్ అనుసరిస్తున్న దూకుడు ధరల వ్యూహం వల్లే తమ బియ్యం వ్యాపారం దెబ్బతిన్నదని అంగీకరించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒక టన్ను భారత బియ్యం ధర సుమారు 1,100 డాలర్లు ఉండగా, అదే రకానికి చెందిన పాకిస్థాన్ బియ్యం ధర 1,300 డాలర్లుగా ఉంది. ఈ రెండు వందల డాలర్ల వ్యత్యాసం వల్ల కొనుగోలుదారులు భారత్ వైపే మొగ్గు చూపుతున్నారు.
ప్రాంతీయ వివాదాలు.. ఎగుమతుల తగ్గుదల
భారత బియ్యం నుంచి వస్తున్న తీవ్రమైన పోటీకి తోడు, సరిహద్దు ప్రాంతాలలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా పాకిస్థాన్ కు పెద్ద శాపంగా మారాయి. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో పాక్ ఆహార ఎగుమతులు ఏకంగా 25 శాతం పడిపోయాయి. సరిహద్దు సమస్యలు మరియు షిప్పింగ్ నిలిచిపోవడం వల్ల మొత్తం విదేశీ వాణిజ్యంలో సుమారు 3.1 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అఫ్గానిస్థాన్ సరిహద్దు వివాదాల కారణంగా ద్వైపాక్షిక రవాణా నిలిచిపోయి దాదాపు 1.1 బిలియన్ డాలర్ల నష్టం రాగా, మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు షిప్పింగ్ రంగాన్ని అస్తవ్యస్తం చేయడంతో మరో 2 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ నష్టాల నుంచి గట్టెక్కడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు కమిటీకి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.
ఇదే సమయంలో కొందరు భారతీయ వ్యాపారులు పాకిస్థాన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, తమ స్వదేశీ బ్రాండ్ గా మార్చి విదేశాలకు విక్రయిస్తున్నారని పాక్ అధికారులు ఆరోపించారు. అయితే, ఇందుకు సంబంధించి తమ వద్ద ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవని కూడా వాణిజ్య సాక్షిగా వారు అంగీకరించారు. దీంతో ఈ నిరాధార ఆరోపణలు కేవలం పరాజయ భారాన్ని తప్పించుకునే ప్రయత్నాలుగానే కనిపిస్తున్నాయి.
దేశీయంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ గందరగోళం ఎదుర్కొంటున్న తరుణంలో ఈ కొత్త వాణిజ్య నష్టాలు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంతో పాటు ఆ దేశ సైన్యానికి పెద్ద సవాలుగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్ లో భారత ఆధిపత్యాన్ని తట్టుకుని తిరిగి మార్కెట్ను చేజిక్కించుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ కు అత్యంత కఠినమైన సవాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.












Click it and Unblock the Notifications