నన్ను ఆపాలంటే చంపాల్సిందే.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది. తాజాగా బెంగాల్ ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు నేతలు కోల్ కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయం తృణమూల్ భవన్ ను ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే రెబల్ వర్గంపై తృణమూల్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు నాయకులకు దమ్ముంటే నేరుగా బీజేపీలో చేరి తనను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. పార్టీలో తిరుగుబాటు చేసిన వారిని ద్రోహులు అంటూ విరుచుకుపడ్డారు.
తాను ప్రాణాలతో ఉన్నంత వరకు ఎవరూ ఆపలేరని.. తనను ఆపాలంటే చంపాల్సిందేనని మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ గుర్తు ఎక్కడికీ పోదని, టీఎంసీని బలహీనపరచే ప్రయత్నాలు ఫలించవని తెలిపారు. ఈ మేరకు కోల్ కతాలో మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ పార్టీలో అసమ్మతికి బీజేపీ కారణమని మమతా బెనర్జీ ఆరోపించారు. రెబల్ నేతలకు ఆ పార్టీ మద్దతు ఇస్తోందని మండిపడ్డారు.
బెంగాల్ లో ఓట్ చోరీ, రిగ్గింగ్ కు పాల్పడి బీజేపీ అధికారంలోకి వచ్చిందని దీదీ ఆరోపించారు. తమ నాయకులపై అధికార ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని.. ఎవరూ భయపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తాను ఎన్నటికీ బీజేపీ ముందు తలవంచబోనని.. టీఎంసీ సిద్ధాంతాలు ఎప్పటికీ బీజేపీ కు వ్యతిరేకమేనని మరోసారి క్లారిటీ ఇచ్చారు.

ఈ పరిణామాల నేపథ్యంలో మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్ గా భావించే చంద్రిమా భట్టాచార్య తాజాగా అన్ని సంస్థాగత పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె రీతబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబల్ వర్గంలో కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే చంద్రిమా రాజీనామాతో పార్టీ రాష్ట్ర, జాతీయ వ్యవహారాలను తానే నేరుగా పర్యవేక్షిస్తానని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఇక ఇటీవల జరిగిన పశ్చిమ్ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. బీజేపీ బెంగాల్ లో తొలిసారిగా అఖండ విజయం సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది.












Click it and Unblock the Notifications