రోశయ్యకు'గేటర్'పరీక్ష
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఆయన ఈ ఎన్నికల కసరత్తును ప్రారంభించారు. రోశయ్య కూడా అందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పెద్గగా ప్రభావం చూపే పరిస్థితి లేదు. సెటిలర్లు ఎక్కువగా ఉన్నందు వల్ల, మజ్లీస్ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నందున ఈ ఎన్నికల్లో కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు పెద్దగా ఈ ఎన్నికల్లో లాభపడే పరిస్థితి లేదని అంటున్నారు. అయితే హైదరాబాద్ ఫ్రీజోన్ అంశం కొంత ఆ పార్టీకి కలిసి రావచ్చుననే అభిప్రాయం ఉంది. అది ఏ మేరకు కలిసి వస్తుందనేది చెప్పడం కష్టమే.
ఇదిలావుంటే, హైదరాబాదులోని యువతలో, ఆంధ్రా సెటిలర్లలో ప్రభావం చూపుతున్న జయప్రకాష్ నేతృత్వంలోని లోక్ సత్తా తెలుగుదేశం పార్టీకి గండి కొట్టే అవకాశాలున్నాయని కాంగ్రెసు భావిస్తోంది. దీని వల్లనే కాకుండా మజ్లీస్ తో ఉన్న స్నేహం వల్ల, దేశవ్యాప్తంగా ముస్లింలు తమ పార్టీ పట్ల అనుసరిస్తున్న అనుకూల వైఖరి వల్ల తాము గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లాభపడుతామని కాంగ్రెసు వర్గాలు చెబుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెసు అధ్యక్షుడు, ఆరోగ్య మంత్రి దానం నాగేందర్ వైయస్ జగన్ అనుకూలంగా ఉన్నారు. ఆయన ఏ మేరకు పని చేస్తారనే సందేహాలున్నాయి. అయితే ఆయనతో పాటు హైదరాబాదుకు చెందిన పార్టీ శాసనసభ్యులను గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు బాధ్యులను చేసేందుకు రోశయ్య సిద్ధపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించాల్సి బాధ్యతను రోశయ్య వారిపై మోపుతున్నారు. దీనివల్ల తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు చెప్పవచ్చు. వైయస్ జగన్ ను వ్యతిరేకిస్తున్న పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెసు విజాయనికి సర్వశక్తులూ ఒడ్డుతారనడంలో సందేహం లేదు. మొత్తం మీద ఈ ఎన్నికలు రోశయ్యకు అగ్ని పరీక్ష కాబోతున్నాయి.