కెసిఆర్ కు కలిసొచ్చిన ఫ్రీజోన్

ఫ్రీజోన్ వ్యవహారంలో ప్రభుత్వం సరిగా వాదించకపోవడం వల్లనే సుప్రీంకోర్టు నుంచి ఆ తీర్పు వెలువడిందనేది ఆయన వాదన. అధికార కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి కె. జానా రెడ్డి కూడా రాష్ట్ర హోం శాఖను ఈ విషయంలో తప్పు పడుతున్నారు. హోం శాఖ వైఫల్యం వల్లనే సుప్రీంకోర్టు తీర్పు ఆ విధంగా వచ్చిందని ఆయన కూడా అభిప్రాయపడుతున్నారు. జానా రెడ్డి హోం మంత్రిగా ఉన్నప్పుడే పోలీసు శాఖలోని స్థానికేతరులను స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దీంతో జానారెడ్డి ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. పోలీసు శాఖలో కూడా స్థానిక, స్థానికేతర వివాదం నలుగుతూనే ఉన్నది. ఈ స్థితిలో దీన్ని తన అస్త్రంగా చేసుకుని కెసిఆర్ ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించారు. తనకు దూరమైన తెలంగాణ ఉద్యోగ సంఘాలను దరి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సిద్ధిపేటలో జరిగిన ఉద్యోగ గర్జన సదస్సుకు తెలంగాణ ఉద్యోగ సంఘాలు హాజరయ్యాయి.
ఫ్రీజోన్ వ్యవహారం తెలంగాణ ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉండడంతో ముఖ్యమంత్రి కె. రోశయ్య అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని అఖిల పక్ష సమావేశంలో నిర్ణయించారు. అయితే రివ్యూ పిటిషన్ వల్ల ఫలితం ఉండదని, హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని శాసనసభలో తీర్మానం చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి అంటోంది. అయితే ఇందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో కెసిఆర్ ప్రజల్లోకి వెళ్లి తనకు మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాజకీయ ఎజెండానే లేకుండా పోయిన కెసిఆర్ కు ఫ్రీజోన్ వ్యవహారం మళ్లీ జీవం పోసింది.












Click it and Unblock the Notifications