Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కెసిఆర్ కు కలిసొచ్చిన ఫ్రీజోన్

K Chandrasekhar Rao
హైదరాబాద్: హైదరాబాద్ ఫ్రీజోన్ అంశం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు రాజకీయంగా బాగా కలిసొచ్చింది. ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్న కెసిఆర్ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడింది. ఈ సమయంలో ఫ్రీజోన్ అంశం ఆయన చేతికి అంది వచ్చింది. హైదరాబాద్ ను ఫ్రీజోన్ గా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నిజానికి, ఈ తీర్పు పోలీసు శాఖకు మాత్రమే వర్తిస్తుంది. హైదరాబాదులోని స్థానికేతరులను తమ తమ స్వస్థలాలకు పంపించే కార్యక్రమం మొదలు కావడంతో పోలీసు శాఖలో ఈ అంశం చర్చకు దారి తీసింది. ఈ స్థితిలో సుప్రీంకోర్టు ఆ తీర్పు వెలువరించింది. రాష్టాన్ని ఆరు జోన్లుగా విభజించి ఏ జోన్ కు చెందినవారు ఆ జోన్ లోనే ఉద్యోగాలు చేయాలనే నిబంధన ఉంది. అయితే హైదరాబాదుకు డిప్యూటేషన్ వంటి వివిధ రూపాల్లో స్థానికేతరులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి చేరారు. హైదరాబాదులో స్థానికేతరులు ఉద్యోగాలు చేయకూడదని రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ఉన్నాయి. అయితే ఆ ఉత్తర్వులు శాఖాధిపతులకు వర్తించవు. దీంతో ప్రభుత్వం శాఖాధిపతులను పదవులను పెద్ద యెత్తున సృష్టించింది. ఒకే శాఖను వివిధ శాఖల కింద విడగొట్టి స్థానికేతరులు హైదరాబాదులో స్థిరపడేందుకు వెసులుబాటు కల్పించింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఇది ప్రధానాంశంగానే ఉంది. ఈ స్థితిలో సుప్రీంకోర్టు పుండు మీద కారం చల్లినట్లయింది.

ఫ్రీజోన్ వ్యవహారంలో ప్రభుత్వం సరిగా వాదించకపోవడం వల్లనే సుప్రీంకోర్టు నుంచి ఆ తీర్పు వెలువడిందనేది ఆయన వాదన. అధికార కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి కె. జానా రెడ్డి కూడా రాష్ట్ర హోం శాఖను ఈ విషయంలో తప్పు పడుతున్నారు. హోం శాఖ వైఫల్యం వల్లనే సుప్రీంకోర్టు తీర్పు ఆ విధంగా వచ్చిందని ఆయన కూడా అభిప్రాయపడుతున్నారు. జానా రెడ్డి హోం మంత్రిగా ఉన్నప్పుడే పోలీసు శాఖలోని స్థానికేతరులను స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దీంతో జానారెడ్డి ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. పోలీసు శాఖలో కూడా స్థానిక, స్థానికేతర వివాదం నలుగుతూనే ఉన్నది. ఈ స్థితిలో దీన్ని తన అస్త్రంగా చేసుకుని కెసిఆర్ ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించారు. తనకు దూరమైన తెలంగాణ ఉద్యోగ సంఘాలను దరి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సిద్ధిపేటలో జరిగిన ఉద్యోగ గర్జన సదస్సుకు తెలంగాణ ఉద్యోగ సంఘాలు హాజరయ్యాయి.

ఫ్రీజోన్ వ్యవహారం తెలంగాణ ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉండడంతో ముఖ్యమంత్రి కె. రోశయ్య అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని అఖిల పక్ష సమావేశంలో నిర్ణయించారు. అయితే రివ్యూ పిటిషన్ వల్ల ఫలితం ఉండదని, హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని శాసనసభలో తీర్మానం చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి అంటోంది. అయితే ఇందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో కెసిఆర్ ప్రజల్లోకి వెళ్లి తనకు మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాజకీయ ఎజెండానే లేకుండా పోయిన కెసిఆర్ కు ఫ్రీజోన్ వ్యవహారం మళ్లీ జీవం పోసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+