చిరంజీవి పొలిటక్స్ ఖతం
చిరంజీవి కాంగ్రెసు అనుకూల వైఖరి వల్లనే సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబు పార్టీకి దూరమైనట్లు చెబుతున్నారు. శాసనసభ, లోకసభ జమిలి ఎన్నికల్లోనే ప్రజారాజ్యం పార్టీ భవితవ్యం తేలిపోయింది. తాము ఆశించింది ఒకటి, జరుగుతున్నది మరోటి కావడంతో వారిద్దరు లాభం లేదనుకుని పార్టీకి దూరమైనట్లు భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని చిరంజీవి చెప్పినప్పటికీ అది అబద్ధమనే విషయం తేలిపోయింది. వారిక పార్టీ వైపు దృష్టి సారించే పరిస్థితి లేదని అంటున్నారు. సినిమాల్లో బిజీగా ఉన్నామనే పేరుతో వారు కాలాన్ని ముందుకు నెట్టేసే వ్యూహాన్ని ఎంచుకున్నారు. చిరంజీవిని వారు నెంబర్ వన్ గా చూడాలని అనుకున్నారు. కానీ, అల్లు అరవింద్ చర్యల వల్ల ఆ వ్యూహమే లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే చిరంజీవి పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తారనే అభిప్రాయం బలంగా ముందుకు వచ్చింది. అదేమీ లేదని చిరంజీవి చెప్పినా ప్రజలు నమ్మే వాతావరణం కనిపించడం లేదు. చిరంజీవి మాటల్లో నమ్మకం కలిగించే గుణం లోపించింది. పైగా, పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు నడిపించగలననే ఆత్మస్థయిర్యం కూడా చిరంజీవిలో కనిపించడం లేదు. కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీనే గుర్తించే పరిస్థితి ఉంది. కాంగ్రెసు వ్యతిరేక అంతా గుండుగుత్తాగా ఒకటవుతూ క్రమంగా తెలుగుదేశం వైపు మళ్లే పరిస్థితులు వచ్చాయి. ఈ స్థితిలోనే చిరంజీవి, జయప్రకాష్ నారాయణ పూర్తిగా విఫలమవుతున్నారు. కాంగ్రెసు ఈ రెండు పార్టీలను పావులుగా వాడుకుంటుందనే అభిప్రాయం కూడా బలం పుంజుకుంటోంది. అందువల్ల చిరంజీవికి రాజకీయ భవిష్యత్తు పెద్దగా కనిపించడం లేదు.