రాజకీయాల్లో సెక్స్ స్కాండల్స్

వారం క్రితమే కేరళ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి రాజమోహన్ ఉన్నిథన్ 57 ఏళ్ల వయస్సులో అనైతికంగా మనుషులను సరఫరా చేస్తున్నాడనే ఆరోపణపై అరెస్టయ్యాడు. అనుమానాస్పద పరిస్థితిలో ఆయన పట్టుబడ్డాడు. ఇటీవలే ఆయన బెయిల్ పై విడుదలయ్యాడు. ఇటీవలి లోకసభ ఎన్నికల సందర్భంగా సినీ నటి, లోకసభ సభ్యురాలు జయప్రద విషయం కూడా తీవ్ర సంచలనం సృష్టించింది. తన సమాజ్ వాదీ పార్టీకి సంబంధించిన అమర్ సింగ్ ఆమె సంబంధాలపై అనుమానాలు వచ్చే విధంగా ఇతర రాజకీయ నాయకులు వ్యాఖ్యానాలు చేశారు. ఎస్పీ నేత ఆజం ఖాన్ తన నగ్నమైన ఫొటోలతో కూడిన పోస్టర్లను పంపిణీ చేశాడని జయప్రద ఆ సందర్భంగా ఆరోపించారు. మార్ఫింగ్ చేసి తన పోస్టర్లను అసభ్యకరంగా ఆజం ఖాన్ పంపిణీ చేశారని ఆమె ఆరోపించారు. తనకూ అమర్ సింగ్ కు గల సాన్నిహిత్యం గురించి ఆమె వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది.
నైతికతకు మారు పేరుగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ (బిజెపి)లోనూ లైంగిక సంబంధాల వివాదాలున్నాయి. గుర్తు తెలియని మహిళతో ఉన్నప్పుడు వీడియో సీడీలు బయట పడడంతో బిజెపి ప్రధాన కార్యదర్శి సంజయ్ జోషీ 2005 డిసెంబర్ లో పార్టీ పదవి నుచి తప్పుకోవాల్సి వచ్చింది. గోవిందాచార్యకు, ఉమా భారతికి మధ్య ప్రేమాయణం నడిచిందంటూ దుమారం కూడా రేగింది. కవయిత్రి మధుమిత శుక్లా హత్య కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి అమరమణి త్రిపాఠీ 2003 సెప్టెంబర్ లో ఆరెస్టయ్యాడు. ఆమెతో అతనికి లైంగిక సంబంధాలు కూడా ఉన్నాయి. మధుమిత కడుపులో పెరుగుతున్న పిండాన్ని పరీక్షించగా అది త్రిపాఠీ డిఎన్ఎతో సరిపోలింది. దీంతో అతను ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నాడు.
ఉత్తరాఖండ్ మాజీ రెవెన్యూ మంత్రి హరక్ సింగ్ రావత్ 2003లో ఒక అవివాహితతో పెట్టుకున్న లైంగిక సంబంధాల వల్ల మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ అస్సామీ మహిళ తర్వాత ఒక పసిబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ వెస్ట్ ఎండ్ పేర తెహెల్కా 2001లో బయట పెట్టిన రక్షణ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకోవడానకి సమతా పార్టీ జర్నలిస్టులకు కాల్ గర్ల్స్ ను పంపడానికి ముందుకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. రక్షణ మంత్రి జగజీవన్ రామ్ కుమారుడు ఒక మహిళతో కలిసి ఉన్న ఫొటో 1978లో సూర్య పత్రిక కవర్ పేజీపై ప్రచురితమైంది. బిజెపి ప్రస్తుత ఎంపి, ఇందిరా గాంధీ కోడలు మేనకా గాంధీ ఆ పత్రిక సంపాదకురాలు. ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్న సమయంలో ఈ స్కామ్ తో జగజీవన్ రామ్ రాజకీయ జీవితం ముగిసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇటువంటి రాజకీయ లైంగిక ప్రచారాలు, ఊహాగానాలు దండిగానే ఉన్నాయి. ఎన్టీఆర్ లక్ష్మిపార్వతిని వివాహమాడినట్లు అధికారికంగా ప్రకటించడానికి ముందు తీవ్ర దుమారమే చెలరేగింది. అలాగే, మాజీ ముఖ్యమంత్రి దివంగత మర్రి చెన్నారెడ్డి, మాజీ ప్రధాని పివి నరసింహారావు వంటి నేతలు కూడా అటువంచి ప్రచారం నుంచి తప్పించుకోలేకపోయారు.












Click it and Unblock the Notifications