డి శ్రీనివాస్ కు సహాయ నిరాకరణ

తాజాగా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వంతు వచ్చింది. పార్టీ సభ్యత్వ నమోదు కోసం బుధవారం ఆయన పార్టీ కార్యాలయం గాంధీ భవన్ నుంచి వీడియో కార్యక్రమం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పార్టీ నాయకులు డిఎస్ కు సహకరించే పద్ధతిలో వ్యవహరించలేదు. నిజామాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్, గుంటూరు జిల్లాల నాయకులతో ఆయన మాట్లాడారు. అయితే, తాము ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని, తాము ప్రజల్లోకి వెళ్తే జగన్ ను ముఖ్యమంత్రిని ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారని కొంత మంది నేరుగానే డిఎస్ తో అన్నారు. గుంటూరు జిల్లాలోని ఓ మండలాధ్యక్షుడు డిఎస్ తో అదే రీతిలో మాట్లాడి చీవాట్లు తిన్నారు.
జగన్ వర్గీయలు మాత్రం జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు సహాయ నిరాకరణ చేసే ఉద్దేశంతోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ జిల్లాల నాయకులు కొంత మంది డిఎస్ కు అందుబాటులోకి కూడా రాలేదు. ఇదంతా డి.శ్రీనివాస్ కు కొంత చిరాకుగానే ఉన్నట్లు తెలుస్తోంది. సహాయ నిరాకరణను తనదైన మార్గంలో పరిష్కరించుకోవడానికి రోశయ్య సిద్ధపడ్డారు. మంత్రులు తనకు సహకరిస్తున్నారని, తనకే చెప్పే మంత్రులు వైయస్ సంస్మరణ సభలకు వెళ్లారని, అందుకే సమీక్షా సమావేశాలకు హాజరు కాలేదని ఆయన చెప్పుకున్నారు. అదే మాటను మంత్రులు చెప్పారు. అయితే ఇదంతా అధిష్ఠానం దృష్టిలో వ్యతిరేక భావం ఏర్పడకూడదని మంత్రులు చేస్తే, తాను సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించుకునేందుకు రోశయ్య చేశారు.
డి.శ్రీనివాస్ ది మాత్రం కాస్తా దూకుడు వ్యవహారం. ఆయన చిరాకు చాలా సందర్భాల్లో దాచుకోలేరు. గతంలో వైయస్ మరణాంతర పరిణామాలపై వ్యాఖ్యానించి జగన్ వర్గీయుల అగ్రహానికి గురయ్యారు. ఆ తర్వాత కూడా మీడియా ప్రతినిధుల సమావేశంలో జగన్ పేరెత్తగానే చిరాకు ప్రదర్శించారు. బుధవారంనాడు మీడియా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులు తన ఇంటి వద్ద దొంగల్లా కాపు కాశారని వ్యాఖ్యానించారు. మీడియాపై చిర్రుబుర్రులాడారు. ప్రస్తుత పరిస్థితిని ఆయన తనకు అనుకూలంగా ఎలా మలుచుకుంటారో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications