రెబెల్సే 'మహా' కింగ్ మేకర్స్?
మహారాష్ట్రలో 1995లో త్రిశంకు శాసనసభ ఏర్పడింది. రికార్డు స్థాయిలో 45 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడిది. ఈ కారణంగా స్వతంత్రుల మద్దతుతో శివసేన - బిజెపి కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం పోటీ చేస్తున్న స్వతంత్రుల్లో 117 మంది ఫలితాలను తారుమారు చేసే శక్తి మాత్రమే కాదు, తాము గెలగలిగే సత్తా ఉన్నవారు. వీరు రాజకీయ పార్టీల తిరుగుబాటు అభ్యర్థులు కావడం విశేషం. వీరిలో 81 మంది కాంగ్రెసు - ఎన్సీపి తిరుగుబాటు అభ్యర్థులు కాగా 27 మది శివసేన - బిజెపి కూటమికి చెందినవారు. మరో 9 మంది ఇతర రాజకీయ పార్టీలకు చెందినవారు.
ఎన్సీపికి తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఎక్కువగా ఉంది. అత్యధికంగా 60 మంది ఎన్సీపి తిరుగుబాటు అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వారిని పార్టీ నుంచి బహిష్కరించడానికి ఎన్సీపి వారం రోజులు తీసుకుంది. అది కూడా కాంగ్రెసు నేత దిగ్విజయ్ సింగ్ అల్టిమేటం ఇచ్చిన తర్వాతనే. వివిధ పార్టీల తిరుగుబాటు అభ్యర్థులు ఫలితాల వెల్లడి తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.