హైదరాబాద్ విముక్తి, తొలి ఎన్నికలు

సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ నేతృత్వంలో ఆపరేషన్ పోలో పేరుతో భారత ప్రభుత్వం సైనిక చర్యకు దిగింది. తద్వారా హైదరాబాద్ రాజ్యాన్ని భారత్ లో విలీనం చేసుకుంది. ఆ రకంగా హైదరాబాద్ రాజ్యం 1948 సెప్టెంబర్ 17వ తేదీన స్వాతంత్ర్యం పొందింది. భారత దేశంలో 1948 - 1956 మధ్య కాలంలో హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగింది.
హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు తొలిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. బూర్గుల రామకృష్ణరావు తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈలోగా మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న తెలుగు మాట్లాడే ఆంధ్ర ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నారు.
పొట్టి శ్రీరాములు దీక్ష - ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం రాజధానిగా మద్రాసు నగరాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గాంధేయవాది పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 58 రోజుల సుదీర్ఘ దీక్ష తర్వాత ఆయన 1952 డిసెంబర్ 15వ తేదీన అమరులయ్యారు. ఆయన అంతిమ యాత్ర సందర్బంగా మద్రాసు, ఆంధ్ర రాష్ట్రాల్లో తీవ్ర హింస చెలరేగింది.
ప్రత్యేక రాష్ట్ర ప్రకటన
మద్రాసును తమిళ రాష్ట్ర రాజధానిగానే పరిగణిస్తూ ఆంద్ర రాష్ట్ర ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం 1952 డిసెంబర్ 19వ తేదీన ప్రకటన చేసింది. జెవిపి (జవహర్ లాల్ నెహ్రూ, వల్లభ భాయ్ పటేల్, సీతారామయ్య) కమిటీ నివేదిక ప్రకారం 1950లోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాల్సి ఉండింది. అయితే మద్రాసును ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలని ఆంధ్ర ప్రజలు ఆందోళనలకు దిగడంతో రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరిగింది.
ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఏర్పడింది. కనీస సౌకర్యాలతో పాటు కేంద్ర కార్యాలయానికి స్థలం కూడా లేకపోవడంతో పాలన సరిగా సాగలేదు. శిబిరాల కింది నుంచి పాలన సాగించాల్సి వచ్చింది. పైగా 15 కోట్ల లోటు బడ్జెట్ కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఉంది.
రాష్ట్రాల పునర్వ్యస్థీకరమ కమిషన్
భాషా ప్రాతిపదికపై ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడంతో అదే ప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పాటుకు దేశంలో ఆందోళనలు ముందుకు వచ్చాయి. భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్విభజనపై సిఫార్సులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 1953లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సయ్యద్ ఫజల్ అలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ తన నివేదికను 1955లో సమర్పించింది.
తెలంగాణలోని తెలుగు మాట్లాడే ప్రజలున్న తెలంగాణ జిల్లాలను హైదరాబాద్ రాష్ట్రంగా విడిగా ఉంచాలని, ఇష్టపడితే 1961లో (రెండు ఎన్నికల తర్వాత) శాసనసభలో మూడింట రెండు వంతుల మెజారిటీ అంగీకారంతో సమైక్య తెలుగు రాష్ట్రంలో కలపాలని, ఈ రెండు ప్రాంతాలు కూడా అసమానంగా అభివృద్ధి చెందినందున అది అవసరమని ఎస్సార్సీ స్పష్టంగా చెప్పింది.
అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేయడానికి ఇష్టపడలేదు. విశాలాంధ్ర డిమాండ్ ను ఆయన తప్పు పట్టారు. దాన్ని విస్తరణ కాంక్షగా అభివర్ణించారు. (ఇండియన్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17, 1953). హైదరాబాదులో మౌలిక సదుపాయాలు సిద్దంగా ఉన్నందున ఆంద్ర నాయకులు తెలుగు సహోదరత్వాన్ని ప్రచారం చేశారు.
విశాలాంధ్ర ఏర్పడాలన్న కొంత మంది అభిప్రాయాలు ఇలా ఉన్నాయి -
హైదరాబాదు మనతో కలిస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి. కానీ అది ఎలా సాధ్యం, దాన్ని ఎలా సాధించగలమనే విషయంపై ఆలోచన చేయాలి - టంగుటూరి ప్రకాశం, 1953
రాజధానికి అవసరమైన సదుపాయాలున్న నగరమేదీ మనకు లేదు - నీలం సంజీవ రెడ్డి (ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి)
(కర్నూలును రాజధానిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే తాము (రాయలసీమ) ఆంధ్ర రాష్ట్రంలో చేరబోమని, మద్రాసు రాష్ట్రంలోనే కొనసాగుతామని హెచ్చరించారు.)
ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నాయకుల మధ్య కుదిరిన శ్రీబాగ్ ఒడంబడిక మేరకు కర్నూలు ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయింది.
రాష్ట్ర రాజధానినే కాదు, జిల్లా కేంద్ర కార్యాలయాన్నికూడా ఏర్పాటు చేసుకోవడానికి తగిన ప్రాంతం లేదు, - కడప కోటి రెడ్డి, 1953
వాణిజ్యంలో అభివృద్ధి చెందిన ప్రాంతం ఆంద్రలో లేదు, విశాఖ ఉన్నప్పటికీ అది కూడా చాలా చిన్నది - ఎ గోపాలరావు, 1954
తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. అభివృద్ధికి అక్కడ అవకాశాలు ఎక్కువ - పూసపాటి విజయరామ గజపతిరాజు, 1955
ఆంద్రలో బొగ్గు, ఆయిల్ వనరులు లేపు. విద్యుదుత్పత్తికి అవకాశాలు కూడా లేవు - బెజవాడ గోపాలరెడ్డి , 1953












Click it and Unblock the Notifications