చంద్రబాబుకు తెలంగాణ టెన్షన్

Chandrababu Naidu
తెలంగాణపై కేంద్రానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను సమర్పించటంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతంతో రెండు ప్రాంతాలలో క్యాడర్ నిలబెట్టుకోలేక పోతున్నారు. లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి, ఎంఐఎం, సిపిఎం పార్టీలు సమైక్యాంధ్రకు, సిపిఐ, కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఇలా రాష్ట్రంలోను ముఖ్యమైన అన్ని పార్టీలు స్పష్టమైన వైఖరితో కట్టుబడి ఉండగా, కేవలం చంద్రబాబు ఒక్కరే ఈ విషయంపై తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నారు. అన్ని పార్టీలు స్పష్టమైన వైఖరితో ఉండగా రెండు ప్రాంతాలలో పార్టీని నిలబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో రెండు కళ్ల సిద్దాంతాన్ని ప్రతిపాదించి రెండు ప్రాంతాలలోని నేతలను తప్పితే కార్యకర్తలను కాపాడుకోలేక పోతున్నారు.

ఈ కారణంగా చంద్రబాబు ఇటు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి, అటు సమైక్యాంధ్రలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ కు భారీగా క్యాడర్ ను కోల్పోవాల్సి వస్తోంది. తెలంగాణ అంశంపై ఆయన స్పష్టమైన వైఖరి చెప్పే వరకు తెలుగుదేశం పార్టీకి కష్ట కాలమే. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎప్పుడు వస్తుందా రాష్ట్రంలోని తెదేపాతో సహా పార్టీలు అన్ని ఎదురు చస్తే, చంద్రబాబు ఒక్కరే అది ఎంత ఆలస్యమైతే అంత మంచిది అనుకుని ఉంటాడనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను అనుకున్న గడువుకంటే ఒకరోజు ముందుగానే సమర్పించడం, హోంమంత్రి చిదంబరం రాష్ట్రంలోని అన్ని పార్టీలను జనవరి 6న రావాలని ఆహ్వానించడం చకచకా జరిగిపోయాయి.

బాబ్లీ ప్రాజెక్టు, రైతుకోసం తదితర విజయాలతో ఉత్సాహంతో ఉన్న చంద్రబాబుకు చిదంబరం ఆహ్వానం నిరుత్సాహ పరిచి ఉండవచ్చు. తెలంగాణపై చిదంబరం ముందు పార్టీ తరఫున ఏం చెప్పాలనేది ఇప్పుడు ఆయన్ను తొలుస్తున్న ప్రశ్న. తెలంగాణ అంటే సీమాంధ్రలో, సమైక్యాంధ్ర అంటే తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్న కార్యకర్తలనే కాకుండా నేతలను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి. దీంతో ఆయన పరిస్థితి అరకత్తెరలో పోక చెక్కలా తయారయింది. అయితే ఆయన మనసులో ఉన్న సమైక్యాంధ్రను మొదటే బహిర్గత పరిచి ఉంటే కాంగ్రెస్ మాదిరిగా తెలంగాణ తెదేపా నేతలు ఉద్యమించే ఆవశ్యకత ఏర్పడి తెలంగాణలో తెదేపా నిలబడేది. తెలంగాణకు చెందిన తెదేపా నేతలు చంద్రబాబుతో విభేదించి తెలంగాణ తెదేపా అన్నప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో వారు చంద్రబాబుకే మద్దతు పలుకుతారనేది స్పష్టం. అప్పుడు అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో పార్టీని కాపాడుకునే అవకాశాలు ఉండేవి.

జనవరి 6వ తేదిన ఏం చేయాలనే విషయంపై ఆయన శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. చిదంబరం సమావేశానికి ఇరు ప్రాంతాల నుండి ఒక్కొక్కరిని పంపించే అవకాశం ఉంది. అయితే వారు ఇరువురు కూడా ఇరు వాదనలు వినిపించే అవకాశం ఉంది. కాంగ్రెస్, తెదేపా మినహా అన్ని పార్టీలు ఇటు సమైక్యాంధ్రకో, అటు తెలంగాణకో ఓటు వేస్తాయి. కాంగ్రెస్ పార్టీలో శ్రీకృష్ణ కమిటీ నియామకం నుండి ఇరుప్రాంతాల మధ్య వాడివేడి వాదనలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి కాంగ్రెస్ నుండి వేరువేరు వాదనలు వస్తాయనేది స్పష్టం. అయితే అది జాతీయ పార్టీ కాబట్టి నో ఎఫెక్ట్. కాంగ్రెస్ మినహా రెండు వాదనలు వినిపించే తెలుగుదేశానికే ఇప్పుడు సమస్యంతా. అందుకే చంద్రబాబు ఇరు ప్రాంతాల నాయకులతో వేరువేరుగా చర్చలు జరుపుతారు. అయితే అంతిమంగా ఆయన ఏ నిర్ణయమూ తీసుకోరనేది కూడా స్పష్టమే. తీవ్ర మంతనాలు చేసినా, అంతర్గతంగా తెలంగాణపై చంద్రబాబు ఎంత మధన పడుతున్నా మళ్లీ మళ్లీ రెండు కళ్ల సిద్ధాంతాన్నే ఆయన ప్రతిపాదిస్తాడు. ఇలా చంద్రబాబులో మార్పు రాక, క్యాడర్ ను నిలబెట్టుకోలేక రాష్ట్రంలో పార్టీయే నిర్వీర్యం అయ్యే పరిస్థితి రావటం ఖాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+