జగన్ పై చంద్రబాబు గెలిచారా?

మొత్తంగా రైతు వ్యతిరేకి ముద్రను దీక్ష ద్వారా చంద్రబాబు పోగొట్టుకున్నారని తెలుగుదేశం వర్గాలు సంతోషిస్తున్నాయి. చంద్రబాబు చేత దీక్షను విరమింపజేయడానికి దేశంలోని జాతీయ నాయకులు తరలి రావడం వల్ల ప్రతిష్ట పెరిగిందని కూడా భావిస్తున్నాయి. జాతీయ మీడియా దృష్టిని కూడా చంద్రబాబు తన దీక్ష ద్వారా ఆకర్షించారని చెప్పవచ్చు. పైగా, వైయస్ జగన్ రాజకీయ బలప్రదర్సనకు మాత్రమే లక్ష్యదీక్ష చేపట్టారనే విషయం బాగా ప్రచారంలోకి వచ్చిందని, రైతుల కోసం చేయలేదని అందరూ అనుకుంటున్నారని, అందువల్ల చిత్తశుద్ధితో రైతుల కోసం దీక్ష చేసింది తమ నాయకుడనే విషయం ప్రజల్లోకి వెళ్లిందని తెలుగుదేశం నాయకులు సంబరపడుతున్నారు. ఈ స్థితిలో భవిష్యత్తు కార్యాచరణ కోసం తెలుగుదేశం వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నారు.
రైతు సమస్యలపై ఇదే విధమైన టెంపోను కొసాగించే ఉద్దేశంతో తెలుగుదేశం నాయకులున్నారు. అందుకు గాను, రైతు గర్జన పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నెల 28వ తేదీన రైతు గర్జన నిర్వహించనున్నట్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ ఇంకా తేదీ ఖరారు కాలేదని తెలుస్తోంది. ఈ సభను గుంటూరులో నిర్వహించాలా, హైదరాబాదులోనా అనే విషయంపై ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను కూడా ఆకర్షించడానికి హైదరాబాదులోనే నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మొత్తంమీద, వైయస్ జగన్ పై చంద్రబాబు పైచేయి సాధించారనే ఆనందం తెలుగుదేశం వర్గాల్లో వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications