చంద్రబాబు బెంబేలు
నన్నపనేని వ్యాఖ్యలతో చంద్రబాబు కోపం నషాళానికి ఎక్కింది. ఆమెపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నన్నపనేని బహిరంగ వ్యాఖ్యలు పార్టీని నష్టపరిచేవిగా ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. నన్నపనేనిపై తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు నన్నపనేని వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించడమే అందుకు కారణం. ఆమె వ్యవహారంపై ఆయన పార్టీ ముఖ్యులతో చర్చిస్తున్నారు. తెలుగు మహిళ మాజీ అధ్యక్షురాళ్లు రోజా, జయప్రద పార్టీలోకి వస్తుండడం వల్లనే నన్నపనేని పార్టీపై విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది. వారిద్దరు పార్టీలోకి వస్తే తన ప్రాధాన్యం తగ్గుతుందని ఆమె ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు. అయితే, ఆ అభిప్రాయాన్ని నన్నపనేని ఖండిస్తున్నారు. రోజాను తానే పార్టీలోకి ఆహ్వానించానని అన్నారు.
కాగా, నన్నపనేని కాంగ్రెసులో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకు గాను ఆమె ముఖ్యమంత్రి రోశయ్యతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుగుదేశం వర్గాలంటున్నాయి. అందుకే తమపై ఆమె విమర్సలు చేస్తున్నారని అభిప్రాయపడుతున్నాయి. అయితే, ఈ వాదనను నన్నపనేని ఖండిస్తున్నారు. తాను తెలుగుదేశంలోనే ఉంటానని ఆమె చెప్పారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి తనను పార్టీలోకి ఆహ్వానించారని, తాను రోశయ్యతో సంప్రదింపులు జరపలేదని, తనకు కాంగ్రెసులో చేరే ఉద్దేశం లేదని ఆమె అంటున్నారు.
మొత్తం మీద, అంతా సర్దుకుందని భావిస్తున్న తరుణంలో నన్నపనేని వ్యాఖ్యలు చంద్రబాబు కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టాయి. నన్నపనేని వెనక ఎవరున్నారనేది ఆయనకు అంతు పట్టకుండా ఉంది. పార్టీలోని మరెంత మంది నన్నపనేనిలా విరుచుకుపడడానికి సిద్ధపడుతున్నారనే విషయంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.