కెసిఆర్ కు విరుగుడు

K Chandrasekhar Rao
తెలంగాణలో ఉప ఎన్నికలు సమీపించే కొద్దీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు కష్టాలు పెరిగే అవకాశాలున్నాయి. కెసిఆర్ వ్యూహానికి కాంగ్రెసు విరుగుడు కనిపెట్టి అమలు చేయడానికి సిద్ధపడింది. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు ద్వారా తెలంగాణలో ఉద్యమ వేడిని తగ్గించడంలో కాంగ్రెసు పార్టీ చాలా వరకు విజయం సాధించిందని చెప్పవచ్చు. కమిటీ నివేదిక కోసం నిరీక్షించడం తప్ప ఏమీ చేయలేని స్థితిలో తెలంగాణ ఉద్యమకారులు చిక్కుకున్నారు. కమిటీని బహిష్కరించాలనే వాదనకు అంతగా బలం చేకూరడం లేదు. కమిటీ నివేదిక చూద్దామనే అభిప్రాయం బలంగా తెలంగాణవాదుల్లో నిలిచిపోయింది. దీన్ని ఆసరాగా తీసుకుని తెరాసను దెబ్బ కొట్టేందుకు కాంగ్రెసు ప్రయత్నాలు ప్రారంభించింది.

ఉప ఎన్నికలు సమీపించేనాటికి తెలంగాణవాదమంతా తెరాసకు అనుకూలంగా మారకుండానే కాకుండా తెరాసకు వ్యతిరేకంగా మారే పరిస్థితులను తేవడానికి కాంగ్రెసు శ్రీకారం చుట్టింది. ఇందుకు కెసిఆర్ వ్యవహార శైలి కూడా కొంత కారణమని చెప్పక తప్పక తప్పదు. తెలంగాణ విద్యార్థులతో, కళాకారులతో ఆయన కయ్యానికి దిగారు. తెలంగాణ కవులు, మేధావులపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అందుకు కెసిఆర్ క్షమాపణ చెప్పాల్సిందేనని తెలంగాణ కవులు, కళాకారుల వేదిక, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల జెఎసి డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి, ఏదో ఒక ప్రయోజనం ఆశించిన కవులు, కళాకారులు మాత్రమే ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఒక రకంగా ఆయన ఆటకు వంత పాడే వాళ్లను మాత్రమే ఆయన దగ్గర చేర్చుకుంటున్నారనే అభిప్రాయం మొదటి నుంచీ బలంగా ఉంది. అది చాలా వరకు నిజం కూడా.

కోస్తాంధ్ర సాహితీవేత్తలకు భృత్యవర్గంగా పనిచేస్తున్న తెలంగాణ సాహిత్యకారులు మాత్రమే ఆయన వెంట ఉన్నారు. నిజాయితీగా, హేతుబద్దంగా తెలంగాణవాదాన్ని ముందు పెడుతున్నవారు, తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నవారు ఆయనకు దూరంగానే ఉండిపోయారు. ఆయన చుట్టూ చేరే కళాకారులను, సాహితీవేత్తలను చూస్తే నిజంగానే ఆయనకు చులకనభావం ఏర్పడి ఉండవచ్చు. అందుకే ఆయన తెలంగాణ మేధావులను, కళాకారులను అవమానించే ప్రకటన చేసి ఉండవచ్చు. అయితే, ఆయన అభిప్రాయం వెనక ఒక సెక్షనల్ వ్యవహారం మాత్రమే ఉంది. తెలంగాణ మేధావి, సాహితీ వర్గాన్ని మొత్తంగా ఆయన పూర్తి స్థాయిలో స్వీకరించలేకపోయారు.

ఈ వాతావరణంలో ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెసు పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది. కాంగ్రెసు రంగంలోకి దిగితే తెలుగుదేశం పార్టీ కూడా దిగి తీరుతుంది. దీనివల్ల రాజీనామా చేసినవారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే వాదనను బలహీనపరిచే దిశగా కాంగ్రెసు పార్టీ అడుగులు వేస్తోంది. మెల్లగా సీమాంధ్ర నాయకులు తెలంగాణలో పర్యటించడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. వైయస్ జగన్ ఖమ్మం జిల్లాలో, చంద్రబాబు నాయుడు మిర్యాలగుడాలో పర్యటించడం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తమను కేవలం తెరాస మాత్రమే వ్యతిరేకిస్తోందని, తెలంగాణ ప్రజలు వ్యతిరేకించడం లేదని వాదనను బలంగా ముందుకు తేవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ రకంగా ఉప ఎన్నికల్లో తెరాసను దెబ్బ తీసేందుకు అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని చంద్రశేఖర రావు ఎలా అధిగమిస్తారనేది వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+