తెలంగాణ రాష్ట్రం ఇస్తారా?
కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై డిసెంబర్ 7వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కె. రోశయ్య అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో పార్టీలన్నీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తన వైఖరిని వెల్లడించాయి. అటువంటప్పుడు దాని అమలుకు ఏ విధమైన అడ్డంకులూ ఉండకూడదు. అయితే, తమ తమ వైఖరులకు వ్యతిరేకంగా ఆయా రాజకీయ పార్టీల్లోని కొంత మంది నాయకులు తిరుగుబాటు ప్రకటించే అవకాశాలు ఉంటాయి. కానీ, పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత పూర్తిగా సమీక్షించిన తర్వాత గాని వెనక్కి వెళ్లకూడదు. పార్టీలో జరుగుతున్న చర్చ నేపథ్యంలో మూడు ప్రాంతాల నాయకులతో కమిటీ వేసి తెలంగాణ డిమాండ్ పై అధ్యయం చేయించి, తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ కోసమే ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో ఎన్నికల్లో పొత్తు కూడా పెట్టుకుంది. పార్టీలో అంత చర్చ జరిగిన తర్వాత తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గడానికి చెప్పిన కారణం ఏ మాత్రం సమంజసం కాదు. అది చంద్రబాబు విశ్వసనీయతకు పెద్ద లోపం.
చిరంజీవి కూడా పార్టీలో విరివిగా చర్చించిన తర్వాతనే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటకు సహకరిస్తామని ఎన్నికల్లో చిరంజీవి హామీ ఇచ్చారు. ఒక్కసారిగా ఏ మాత్రం చర్చ లేకుండా పార్టీ వైఖరిని ఆయన మార్చుకున్నారు. దీనికి సంబంధించిన సామంజస్యం లేదు. అది ఆయన విశ్వసనీయతను భంగపరిచేదే. కాంగ్రెసు అధిష్టానం విశ్వసనీయతపై అపనమ్మకంతో చంద్రబాబు, చిరంజీవి తొలుత తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశారు తప్ప తెలంగాణ ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదనే ఉద్దేశంతో కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత తమ పార్టీ సీమాంధ్ర నాయకులు వ్యతిరేకిస్తే కాంగ్రెసు అధిష్టానం ఎలా వ్యవహరించి ఉండేదో అనే విషయాన్ని గమనించే అవకాశం కూడా ఇవ్వకుండా చిరంజీవి, చంద్రబాబు ప్టేటు ఫిరాయించారు. దానివల్ల కాంగ్రెసుకు ప్రయోజనం చేకూరిందనే చెప్పాలి.
చిరంజీవి, చంద్రబాబు చర్యల వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వెనక్కి పోయింది. సీమాంధ్రలో చెలరేగిన ఆందోళనలను ప్రభుత్వం ఏ విధంగా నియంత్రించేదో చూడడానికి కూడా వారిద్దరు అవకాశం ఇవ్వలేదు. వారిద్దరి నిర్ణయం వల్లనే రాష్ట్ర పరిస్థితి అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని వేయాల్సి వచ్చింది. శ్రీకృష్ణ కమిటీ ఈ నెల 31వ తేదీలోగా తన నివేదికను సమర్పించనుంది. అయితే, తెలంగాణకు నివేదిక అనుకూలంగా ఉంటుందా, లేదా అనేది ముఖ్యమైన విషయం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తిరిగి కేంద్రం అనుకూలంగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందా అనేదే సందేహం.