వైయస్ గొప్పకు మచ్చ
వైయస్ గొప్ప తనానికి మచ్చ తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైయస్ అంత గొప్ప నాయకుడేమీ కాదని చెప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజానికి, వైయస్ సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కె. రోశయ్యకు పెను భారంగా మారాయి. ఆర్థిక పరిస్థితి గాడి తప్పుతుందనే విషయాన్ని చాలా మంది మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే ఎవరి మాటలూ వినకుండా వైయస్ సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతూ పోయారు. అయితే, రోశయ్య ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కోత పెడుతోందని వైయస్ జగన్ విమర్శలు చేస్తుండడం, సాక్షి దినపత్రికలో వార్తాకథనాలు ప్రచురిస్తుండడం మొదలు పెట్టారు. దీంతో రోశయ్య ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. దాన్ని దెబ్బ కొట్టడానికే వైయస్ వ్యతిరేకులు రంగంలోకి దిగినట్లు భావించవచ్చు.
వైయస్ సంక్షేమ పథకాలపై సమీక్ష జరపాలని జెసి దివాకర్ రెడ్డి అనడంతో ఒక్కసారిగా వివాదం మొదలైంది. కాంగ్రెసులో రెండు వర్గాలు ఏర్పడ్దాయి. వైయస్ వన్నీ బోగస్ పథకాలేనని మరో సీనియర్ శాసనసభ్యుడు డిఎల్ రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారం రేపింది. తాను వైయస్ చెంచాను కాదని కూడా ఆయన చెప్పుకున్నారు. మరో సీనియర్ శాసనసభ్యుడు పి. శంకర రావు వైయస్ వర్గీయులపై విమర్సలు చేస్తూ జెసికి మద్దతు తెలిపారు. మంత్రి దానం నాగేందర్, పిసిసి ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు జెసి దివాకర్ రెడ్డి తదితరులపై తీవ్రంగా మండిపడ్డారు. దీంతో కాంగ్రెసులో రెండు వర్గాలు ఏర్పడి విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి.
వైయస్ సంక్షేమ పథకాలను ఆసరాగా తీసుకుని వైయస్ జగన్ రాజకీయాలు చేయడానికి ముందుకు రావడంతో అసలుకే ఎసరు పెట్టే ఉద్దేశంతో ఆయన వ్యతిరేకులు వివాదానికి తెర తీశారని భావించవచ్చు. వైయస్ గొప్పతనానికే గండి కొడితే మొత్తంగానే సమస్య పరిష్కారమవుతుందనేది వారి ఆలోచనగా కనిపిస్తోంది. వైయస్ మహా నాయకత్వానికి ఒక రకంగా గండి పడినట్లే.