చంద్రబాబు నాయుడు తెలంగాణలో తిరుగుతారా?
ఉప ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం నాయకులు ఎవరు పాల్గొంటారనేది మాత్రం తేలడం లేదు. చంద్రబాబు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పడం కష్టమే. అయితే చంద్రబాబు తెలంగాణలో పర్యటించడం అంత సులభం కాకపోవచ్చు. సీమాంధ్రకు చెందిన నాయకులు ప్రచారానికి దిగితే తెలంగాణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉంది. తెలంగాణ రాజకీయ జెఎసి, విద్యార్థి జెఎసి కార్యకర్తలు ఇప్పటికే కాంగ్రెసు, తెలుగుదేశం నాయకులపై కారాలు మిరియాలు నూరుతున్నారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి క్యాడర్ దండిగానే ఉంది. ఆ పార్టీ కార్యకర్తలు తెలంగాణవాదులకు వ్యతిరేకంగా ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో తెలంగాణలో ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణవాదులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఘర్షణలు జరిగే ప్రమాదం లేకపోలేదు. హైదరాబాదులో చంద్రబాబు ప్రసంగం సందర్భంగా సంఘటనలు పునరావృతమవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి ప్రచార బాధ్యతను భుజాన మోస్తారా అనేది కూడా చెప్పలేం. అయితే జనార్దన్ రెడ్డికి కూడా ప్రచారం అంత సులభం కాకపోవచ్చు.
కాంగ్రెసు నుంచి ముఖ్యమంత్రి కె. రోశయ్య గానీ ఇతర సీమాంధ్ర నాయకులు గానీ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదు. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రచార బాధ్యతలు చేపట్టవచ్చు. తెలంగాణకు చెందిన నాయకులే ఆ భారాన్ని మోస్తారని భావించాల్సి ఉంటుంది. కాంగ్రెసు కన్నా తెలుగుదేశం పార్టీకి ప్రచారం కష్టంగా మారే అవకాశం ఉంది.