ఇరకాటంలో కెవిపి
దానికితోడు, రాష్టంలో సంభవిస్తున్న పలు పరిణామాలు, ముఖ్యమంత్రి కె. రోశయ్యకు వ్యతిరేకంగా జరుగుతున్న సంఘటనలు కూడా కెవిపి రామచందర్ రావుకు చుట్టుకునే ప్రమాదం ఉంది. ప్రతిపక్షాలకు, ప్రజలకు పలు సంఘటనలు ముఖ్యమంత్రి రోశయ్య వైఫల్యంగా కనిపిస్తున్నప్పటికీ భవిష్యత్తులు వాటికి రామచందర్ రావు బాధ్యత వహించాల్సి రావచ్చుననే మాట వినిపిస్తోంది. హైదరాబాద్ అల్లర్లు మొదలు ఇటీవలి సోంపేట ఘటన వరకు శాంతిభద్రతలకు సంబంధించిన విషయాలు కెవిపి మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రధానమైన ప్రజా భద్రతా సలహాదారు పదవిని ఆయన కట్టబెట్టారు. దీంతో రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి శాంతిభద్రతల విషయంలో నామమాత్రంగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. శాంతిభద్రతల విషయాలను వైయస్ రాజశేఖర రెడ్డి, కెవిపి రామచందర్ రావు చూసుకుంటూ వచ్చారు. అయితే వైయస్ మరణించిన తర్వాత కూడా కెవిపి ప్రజా భద్రతా సలహాదారుగా కొనసాగుతున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు నిరాహార దీక్ష పరిణామాలు, హైదరాబాద్ అల్లర్లు, జగన్ వరంగల్ జిల్లా ఓదార్పు యాత్ర వల్ల జరిగిన మహబూబాబాద్ కాల్పులు, సోంపేటలో పోలీసు కాల్పులు, ఇప్పుడు చంద్రబాబు బాబ్లీ యాత్ర వల్ల తలెత్తిన సమస్య వంటివి కెవిపికి భవిష్యత్తులో కష్టాలను తెచ్చి పెట్టవచ్చు. ప్రస్తుతం కాంగ్రెసు పార్టీకి, ముఖ్యమంత్రి రోశయ్యకు సన్నిహితంగా మెలుగుతున్న కెవిపి రామచందర్ రావుపై అధికార పక్షం నుంచి ఏ విధమైన విమర్శలు రావడం లేదు. వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితురాలు కావడంతో సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ విషయంలో విమర్శలను తానే మోస్తున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం పలు మార్లు కెవిపిని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేసింది. జగన్ ఓదార్పు యాత్ర పరిణామాలు కూడా ఆయనపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
వైయస్ జగన్ పార్టీ అధిష్టానంపై ధిక్కారం పెంచి, మరింత దూకుడుగా ముందుకు సాగితే కెవిపి మరింత గడ్డు సమస్యను ఎదుర్కునే అవకాశం ఉంది. పార్టీ అధిష్టానం మాట వింటూ కాంగ్రెసులో ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్న కెవిపి సలహాను జగన్ వినడం లేదని అంటున్నారు. అయినా వైయస్ పై ప్రేమతో జగన్ ను ఎప్పటికప్పుడు కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చివరకు చేయి దాటి పోయే పరిస్థితి రావచ్చు. అప్పుడు కెవిపి తన మార్గమేదో ఎన్నుకోవాల్సిందే.