రోశయ్యపై గెలిచిన కెవిపి

ఢిల్లీలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని రోశయ్య కలిసిన సమయంలో కూడా కెవిపి వెంటే ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ కోసం రోశయ్య మొయిలీని కలిశారు. అది కాస్తా రోశయ్యకు ఎదురు తిరిగింది. మంత్రివర్గాన్ని సంపూర్ణంగా మార్చేందుకు మొయిలీ అంగీకరించలేదని చెబుతున్నారు. ప్రస్తుత మంత్రివర్గం వైయస్ రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసుకున్నది. మంత్రుల్లో చాలా మంది వైయస్ జగన్ కు అనుకూలురు. దీంతో వారు రోశయ్యకు సరిగా సహకరించడం లేదని అంటున్నారు. అయితే కెవిపి చాణక్యనీతిలో భాగంగా వారు రోశయ్య నాయకత్వాన్ని వారు ప్రస్తుతం సమర్థిస్తున్నారు. కానీ వారు పూర్తిగా వైయస్ జగన్ కే విధేయులుగా ఉంటారు. అందువల్ల ప్రస్తుత మంత్రుల్లో ఎవరికి కూడా ఉద్వాసన చెప్పడం కెవిపికి ఇష్టం లేదు. దాంతో మంత్రివర్గ విస్తరణను సాధ్యమైనంత మేరకు అడ్డుపడడమే ఆయన ధ్యేయంగా కనిపిస్తుంది. వీరప్ప మొయిలీ మొదటి నుంచి జగన్ కు అనుకూలంగానే ఉన్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణకు కెవిపి అడ్డు పడగలిగారని అంటున్నారు.
కాగా, వైయస్ జగన్ ఓదార్పు యాత్ర సందిగ్దంలో పడిన సందర్భంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి దానికి అనుమతి సాధించడంలో కెవిపి విజయం సాధించారు. ఒక్కడుగు వెనక్కి వేసి రెండడుగులు ముందుకు పడేలా చేసుకోవాలనే ఎత్తుగడలో భాగంగా వైయస్ జగన్ తొలిసారి రోశయ్యతో సఖ్యతకు అంగీకరించారు. రోశయ్య ఇంటికి వెళ్లి తన తోడ్పాటును అందిస్తానని చెప్పారు. అలాగే, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో కూడా సమావేశమయ్యారు. ఇదంతా కెవిపి వ్యూహరచనలో భాగంగానే జరిగిందని అంటున్నారు. ఆ రకంగా ఓదార్పు యాత్రకు అడ్డంకులు లేకుండా చూసుకున్నారు. మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయించడం ద్వారా వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు మంత్రుల సహకారం సాధించుకున్నారు. ఒక రకంగా ఓదార్పు యాత్రకు ముందు తన వర్గానికి కెవిపి నమ్మకం కలిగించారు.
ప్రజల్లో తన బలాన్ని, సత్తాను చాటుకోవడం ద్వారా కాంగ్రెసు అధిష్టానం మనస్సు దోచుకోవాలనే ఎత్తుగడను జగన్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సామరస్యపూర్వక విధానం ద్వారా ముందుకు సాగాలనే కెవిపి మంత్రం జగన్ వద్ద బాగానే పని చేసింది. ఇదే తరహాలో ఆయన ముందుకు సాగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications