జగన్ లక్ష్యం నెరవేరినట్లేనా?

నష్టమా, లాభమా అనే ఆలోచన లేకుండా వైయస్ జగన్ వైపు కొంత మంది శాసనసభ్యులున్నారు. వారిలో కొండా సురేఖ, ఆదినారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కమలమ్మ, శేషారెడ్డి వంటి దాదాపు 15 మంది శాసనసభ్యులున్నారు. కొంచెం అటూ ఇటుగా ఉన్నవారు కూడా అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారని భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు జగన్ వైపు చేరిపోయారు. వైయస్ జగన్ పార్టీ పెట్టిన తర్వాత ముందు వరుసలో ఉండడానికి వారు మొదటే జగన్ వైపు ఫిరాయించారు. కొణతాల రామకృష్ణ, సామినేని ఉదయభాను వంటి మాజీలకు వైయస్ జగన్ వైపు వెళ్లడం వల్ల కలిగే నష్టం ఏమీ లేదు. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు వైయస్ జగన్ పార్టీ తరఫున పోటీ చేయడానికి తమకే ప్రాధాన్య లభిస్తుందనేది వారి ఆలోచనగా చెబుతున్నారు. అందువల్ల మాజీలు ఎక్కువగా వైయస్ జగన్ వైపు వెళ్తున్నారు.
ప్రస్తుత శాసనసభ్యులు మాత్రం ఏ నిర్ణయమూ తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సమస్య ఎక్కువగా కోస్తాంధ్రలో ఉంది. రాయలసీమలో ఎటు ఉండదలుచుకున్నవారు అటు ఉండడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో మాత్రం వైయస్ జగన్ కు ఇప్పుడే పెద్దగా మద్దతు లభించే అవకాశాలు లేవు. తెలంగాణ అంశం జగన్ కు పెద్ద ఆటంకంగా మారింది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఈ ప్రాంతం నుంచి ఆయనకు మద్దతు లభించవచ్చు. కానీ, అది జగన్ కు అంత సులభమైన విషయం కాదు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర నాయకులు చాలా మంది జారిపోయే ప్రమాదం ఉంది.
మొత్తం మీద, కాంగ్రెసు శాసనసభ్యులను డైలమాలో పడేసి తన వైపు వచ్చే విషయంపై ఆలోచన చేయించాలనే వైయస్ జగన్ లక్ష్యం విజయవాడ లక్ష్యదీక్ష ద్వారా నెరవేరినట్లేనని భావిస్తున్నారు. శాసనసభ్యులు మాత్రమే కాకుండా ఇతర పార్టీల నాయకులు కూడా జగన్ వైపు వెళ్లే విషయంలో సానుకూలంగా వ్యవహరించే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. దీంతో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications