కెసిఆర్ పై రాములమ్మ కినుక
పార్టీలో మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ ఆవిర్భావ సభలో విజయశాంతి అన్నారు. పొత్తులతో చిత్తయ్యామని కూడా ఆమె విమర్శించారు. పరోక్షంగా ఆమె కెసిఆర్ వ్యవహార శైలిపై విమర్శలు చేశారు. దానికి కెసిఆర్ కూడా అదే రీతిలో సమాధానం ఇచ్చారు. కాడి మోసే వాడికి బరువు తెలుస్తుందని ఆయన అన్నారు. ఇలా ఇరువురు పరస్పరం విమర్శలు చేసుకోవడం పార్టీ శ్రేణులకు పెద్దగా నచ్చినట్లు లేదు. పార్టీ ఆవిర్భావ సభ వేదికపై విజయశాంతికి స్థానం కల్పించినప్పటికీ ఆమెకు మాట్లాడేందుకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. తీర్మానాలు ప్రతిపాదించే అవకాశం కూడా ఇవ్వలేదు. విజయశాంతి మాట్లాడడానికి సిద్ధమైనప్పుడు రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడాలని కెసిఆర్ సూచించారు. ఈ రకంగా ఆమెకు తగిన ప్రాధాన్యం లభించకుండా చేశారు.
అదే సమయంలో రోషం హీరో బాలును వేదికపైకి ఆహ్వానించి వేదికపై కూర్చోబెట్టారు. సభకు ముందు మంద కృష్ణ మాదిగ విజయశాంతిని కలుసుకోవడంపై తెరాసలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కెసిఆర్ గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. కెసిఆర్ ను మందకృష్ణ మాదిగ తీవ్రంగా తప్పు పట్టారు. ఆయనపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. తనపై కెసిఆర్ దాడి చేయించారని ఆయన ఆరోపించారు. అటువంటి మందకృష్ణ మాదిగను విజయశాంతి కలుసుకోవడం కెసిఆర్ కు నచ్చడం లేదు.