ఎవరీ రాజా,ఎందుకీ 'కరుణ'?
దళిత నాయకుడు కాబట్టి రాజా డిఎంకెకు అత్యవసరంగా మారారు. డిఎంకెకు దళిత ముఖం కూడా ఆయనే. అందుకే ఆయనను వెనకేసుకు రావడానికి పూనుకుంది. 2011లో తమిళనాడు శాసనసభకు ఎన్నికలు ఉన్నాయి. దీంతో రాజాను దూరం చేసుకుంటే దళితులు పార్టీకి దూరం కావచ్చుననేది కరుణానిధి భయం. తమిళ రాజకీయాల్లో అత్యంత వేగంగా ఎదిగిన దళిత నాయకుడు రాజా. ఆయన తమ 35వ యేట 1999లో ఎన్డీఎ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. కేంద్రంలో ఎన్టీఎ, యుపిఎ ప్రభుత్వాల్లో మంత్రిగా పలు శాఖలను నిర్వహించిన అనుభవం సంపాదించారు. దయానిధి మారన్ ను పక్కన పెట్టి రాజాకు టెలికం మంత్రి పదవిని కరుణానిధి కట్టబెట్టారు. కరుణానిధికి అత్యంత సన్నిహితుడు, దళిత నాయకుడు కావడం వల్లనే రాజాకు అంత ప్రాధాన్యం లభించింది.
రాజా 1963 మేలో తమిళనాడులోని పెరంబలూరులో రాజా జన్మించాడు. ఏ మాత్రం సౌకర్యాలు లేని స్థితిలో కూడా రాజా త్రిచిలో బిఎస్సీ చేసి, ఆ తర్వాత లా చదివాడు. రాజా కవి కూడా. కరుణానిధి కూడా కవి. కవిత్వ ప్రావీణ్యమే రాజాను కరుణానిధికి దగ్గర చేసిందని అంటారు. డిఎంకె మాతృ సంస్థ ద్రవిడ కజగం విద్యార్థి నాయకుడిగా రాజా పనిచేశారు. బ్లాక్ స్థాయి నాయకుడి నుంచి అత్యంత వేగంగా ఎదిగి 1996లో లోకసభకు పోటీ చేశారు. అప్పటి నుంచి రాజా నాలుగోసారి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక్క రూపాయికి కిలో బియ్యం, 50 పైసలకు ఫోన్ లో హల్లో అనేది రాజా ఎన్నికల నినాదం. తాను టెలికం రంగంలో విప్లవం తెచ్చానని రాజా తాను రాజీనామా చేసిన సమయంలో చెప్పారు.