వైయస్ జగనే అసలు సమస్య

YS Jagan
రాష్ట్రంలో కాంగ్రెసు అధిష్టానానికి తమ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తప్ప మరోటి సమస్య కనిపించడం లేదు. ప్రజా సమస్యలు, అవినీతి ఆరోపణలు ఏవీ పార్టీకి పట్టడం లేదు. రాష్ట్ర రాజకీయాలను కాంగ్రెసు పార్టీ జగన్ చుట్టూ తిప్పుతోంది. కాంగ్రెసు పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడి జగన్ విషయంపైనే విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. వైయస్ జగన్ ఓదార్పు యాత్రను ముందుకు తెచ్చి రాష్ట్ర సమస్యలను పూర్తిగా విస్మరిస్తోంది. వైయస్ జగన్ కు కూడా తన తండ్రి వైయస్ మరణానికి దిగ్భ్రాంతికి గురై చనిపోయినవారి కుటుంబాలు తప్ప మరోటి పట్టడం లేదు. అటువంటి మరణాలు ఎంత ఎక్కువగా లెక్కవేసినా 450 దాకా ఉంటాయేమో. వాటిలో సహజ మరణాలు కూడా ఉన్నాయని కాంగ్రెసు నాయకులే అంటున్నారు. ఈ 450 కుటుంబాల బాగోగులు తప్ప ఇతర కుటుంబాల విషయం వైయస్ జగన్ కు పట్టదా అనేది ఆసలు సమస్య. అయితే, ఆ కుటుంబాలను ఓదార్చే మిషతో ఆయన రాష్ట్ర నాయకత్వం కోసం పోటీ పడుతున్నారని ఎవరిని అడిగినా చెప్తారు. స్వయంగా ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డే ఆ విషయం చెప్పారు. రోశయ్య, చంద్రబాబు, వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం కోసం చేసుకున్న పోరాటంలో తాను బలి పశువును అవుతున్నానని ఆయన అన్నారు.

కాగా, వి హనుమంతరావు, పాల్వాయి గోవర్దన్ రెడ్డి వంటి వైయస్ జగన్ ప్రత్యర్థులు కూడా వైయస్ జగన్ ఓదార్పు యాత్రపైన, ఆయన అధికార తాపత్రయం మీద మాత్రమే మాట్లాడుతూ వస్తున్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య నాయకత్వాన్ని బలపరచడమే పరమావధిగా వారు వ్యవహరిస్తున్నారు. వీరు అధిష్టానం ఎజెండాకు అనుగుణంగా మాట్లాడుతున్నారనేది వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. వైయస్ జగన్ ను ఆధిపత్య ధోరణిని దెబ్బ తీసి తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలనే పార్టీ అధిష్టానం వ్యూహంలో భాగంగానే వారు వ్యవహరిస్తూ వస్తున్నారు. వారికి కూడా ప్రజా సమస్యల ఊసు అవసరం లేకుండా పోయింది.

కాంగ్రెసు పార్టీయే అధికార, ప్రతిపక్ష పాత్రలను పోషిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆత్మరక్షణలో పడ్డారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోని అవినీతి, అక్రమాలను ప్రధాన ఎజెండా చేసుకుని ఆయన మాట్లాడుతున్నారు. నిజానికి, చంద్రబాబు మాటలనే కాంగ్రెసులోని జగన్ ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు. అందువల్ల చంద్రబాబు చేసే పోరాటానికి ప్రత్యేకత లేకుండా పోతోంది. ఆ పోరాటం వల్ల ఆయనకు ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనం కూడా లేకుండా పోయింది. వైయస్ జగన్ వర్గం నుంచి, ఆయన వ్యతిరేక వర్గం నుంచి కూడా చంద్రబాబు విమర్శలను ఎదుర్కుంటున్నారు. మరో వైపు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి నుంచి కూడా ఆయన వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. చంద్రబాబుకు సంబంధించి ఇదో విచిత్రమైన పరిస్థితి. ఎవరు ఏం చేసినా వైయస్ జగన్ కేంద్ర బిందువుగా మారిపోయారు. అది ఆయనకు మేలు చేస్తుందా, నష్టం చేస్తుందా అనేది ఇప్పుడు అంచనా వేయలేం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+