జగన్ కొత్త ఎత్తుగడ
ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి ముందు సాక్షి టీవీ చానెల్ లో ఆర్. కృష్ణయ్యతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తమకు అనుకూలంగా కృష్ణయ్యను సాక్షి టీవీ చానెల్ ప్రతినిధి ప్రశ్నలు వేయడం ఈ కార్యక్రమంలో స్పష్టంగా కనిపించింది. వైయస్ హయాంలో కూడా ఫీజుల బాకీలున్నాయని, అయితే, వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ పోయారని, ఇప్పుడు చెల్లింపులు ఆపేయడంతో బాకీలు 2 వేల కోట్ల రూపాయల దాకా పేరుకుపోయాయని కృష్ణయ్య ఈ కార్యక్రమంలో చెప్పారు. దీన్ని బట్టి వైయస్ హయాంలో బాకీలే లేవనడం సరి కాదనేది తేలిపోయింది. అయినా సాక్షి టీవీ చానెల్ గానీ పత్రిక గానీ బాకీలే లేనట్లుగా ప్రచారం సాగిస్తున్నాయి.
ఫీజుల రీయంబర్స్ మెంటు వ్యవహారంలో విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉండడం, కృష్ణయ్య దీక్ష చేస్తే విద్యార్థుల నుంచి ఇతోధిక మద్దతు లభించడం వంటి కారణాల వల్ల తప్పకుండా రోశయ్య ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందనేది జగన్ వ్యూహమని చెబుతున్నారు. ఆయన వ్యూహం ఏదో మేరకు ఫలించినట్లేనని చెప్పవచ్చు. కృష్ణయ్యది న్యాయమైన డిమాండ్ కావడంతో ప్రతిపక్షాలన్నీ మద్దతు ప్రకటించాయి. ఆర్. కృష్ణయ్య డిమాండ్ కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు తగిన నైతిక బలం ఎవరికీ లేదు. ఈ రకంగా జగన్ రోశయ్యను ఇరకాటంలో పెట్టినట్లేనని భావిస్తున్నారు.