హరికృష్ణను ఉడికిస్తున్న చంద్రబాబు

తనను వ్యతిరేకించే నాయకులకు వ్యతిరేకంగా పార్టీలోనే ఓ జట్టును తయారు చేస్తారు. వారి చేత అసమ్మతి నాయకులను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు. అలా దిగివస్తే ఫరవాలేదు. లేకుంటే పొమ్మనలేక పొగపెడతారు. ఎదుటివారిని తీవ్ర అసహనానికి గురి చేస్తారు. అసహనానికి గురైన నాయకులు తమ దారి తాము వెతుక్కుంటారు. తనను వ్యతిరేకించేవారిని ఆయన తన ప్రత్యర్థులుగానే చూస్తారు. పార్టీలోనివారినైనా, ఇతర పార్టీలవారినైనా ఆయన అలాగే గుర్తిస్తారు. హరికృష్ణను చంద్రబాబు పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నారు. మహానాడులో హరికృష్ణ చేసిన ఆగడాలపై ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హరికృష్ణతో ప్రైవేట్గానైనా సరే ఆయన మాట్లాడడానికి సిద్ధపడలేదు. జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు రాకున్నా ఏమీ అనలేదు.
హరికృష్ణ ప్రోద్బలంతోనే జూనియర్ ఎన్టీఆర్ తనపై కత్తులు నూరుతున్నాడనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. వారిద్దరిని పార్టీ నుంచి పంపించి వేయడమే ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వారిపైకి తన బావ మరిది, సినీ హీరో బాలకృష్ణను రెచ్చగొడుతున్నారనే మాట వినిపిస్తోంది. బాలకృష్ణను చేరదీసి వారిని దెబ్బ కొట్టాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. చంద్రబాబు వ్యూహానికి అనుగుణంగానే బాలకృష్ణ వ్యవహరిస్తున్నారు.
గతంలో తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, హరికృష్ణ పార్టీ నుంచి వెళ్లిపోయినా, వేరే పార్టీ పెట్టుకున్నా చంద్రబాబు ఏమీ అనలేదు. వారిని విస్మరించడమనే వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఒక రకంగా వారిని వాడుకుని వదిలేశారని అంటారు. ప్రస్తుతం చంద్రబాబు పాత కథనే కొత్తగా నడిపిస్తున్నారని అంటున్నారు. గతంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు, హరికృష్ణ పట్ల వ్యవహరించినట్లుగానే ఇప్పుడు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పట్ల వ్యవహరిస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications