వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు మాటలు ఉత్తవే, సీనియర్ల తిష్ట

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
పార్టీలో యువతకు, మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 30వ మహానాడు వేదికపై ప్రకటించడం ద్వారా టిడిపిలో యువత మరోసారి చర్చకు వచ్చింది. పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు టిడిపిలో యుతకు ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూనే వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అఖిలాంధ్ర ప్రేక్షకుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు యువత, మహిళలకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్టీఆర్ యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో అప్పటి వరకు రాజకీయాలపట్ల పూర్తి స్తబ్దగా ఉన్న యువత చొచ్చుకు వచ్చింది. ఎన్టీఆర్ పార్టీ స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించాడు. అయితే ఆయన అధికారంలోకి రావడానికి అండగా నిలబడింది మాత్రం యువత, మహిళలే. ఎన్టీఆర్ పార్టీ నడిపినన్నాళ్లూ యువతకు మంచి ప్రాధాన్యం ఇచ్చారు. అయితే పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతికి వచ్చాక పరిస్థితి మారి పోయింది. చంద్రబాబు పార్టీలోని సీనియర్లకే ప్రాధాన్యం ఇస్తూ యువతను పక్కన పెట్టారు. ఓ సమయంలో యువత రాజకీయాలకు దూరంగా ఉండాలనే చెబుతూ ఏకంగా పార్టీ విద్యార్థి విభాగం టిఎన్ఎస్ఎఫ్‌ను రద్దు చేశారు. అయితే మిగిలిన పార్టీలు విద్యార్థి సంఘాల పేరుతో యువతకు దగ్గరవుతుండటం చూసి బాబు కూడా తన నిర్ణయాన్ని మార్చుకొని టిఎన్ఎస్ఎఫ్‌ను పునరుద్దరించారు.

అయితే పార్టీలో యువతకు ప్రధాన బాధ్యతలు అప్పగించడంలో మాత్రం సఫలం కాలేక పోయారు. యువతకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే నడిపించలేరనే భయం వల్లనో, పార్టీ పెట్టినప్పుడు యువతగా వచ్చిన నేటి సీనియర్లను దూరం పెట్టడానికి మోహమాటమో ఏమో గానీ టిడిపిలో మాత్రం యువతకు అంతగా ప్రాధాన్యం లేకుండా పోయింది. భాజపాకు చెందిన ఎబివిపి, కాంగ్రెసుకు చెందిన ఎన్ఎస్యుఐ, టిఆర్ఎస్‌కు చెందిన టిఆర్ఎస్వీ, లెఫ్ట్ పార్టీలకు చెందిన ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి విభాగ సంస్థలు పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకుంటుండగా టిడిపికి చెందిన టిఎన్ఎస్ఎఫ్ మాత్రం ఎప్పుడో కానీ కనిపించక పోవడమే మంచి నిదర్శనం. పార్టీలోని సీనియర్లు కూడా యువతను పైకి ఎదగకుండా తొక్కేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. యువతను కేవలం మహానాడు వంటి పలు కార్యక్రమాలలో వాలంటరీ పోస్టులకే పరిమితం చేస్తున్నారు. 2004లో పార్టీ అధికారానికి దూరం అయ్యాక యువత టిడిపికి మరింత దూరం అయినట్లుగా కనిపిస్తోంది. ఈ ఏడేళ్లలో ఎక్కడ చూసినా సీనియర్లదే హవా. ప్రతిసారి యువతకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న చంద్రబాబు సాధారణ ఎన్నికల్లో వారికి ఏ మేరకు టిక్కెట్లు కేటాయిస్తారో స్పష్టంగా చెప్పలేక పోతున్నారు. ఎందుకంటే అక్కడ సీనియర్లదే హవా కాబట్టి. దీంతో యువత కూడా పార్టీపై తీవ్ర ఆవేదనతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. మహానాడులో పలువురు యువతకి ప్రధాన్యత ఇవ్వాలని అధినేత దృష్టికి తీసుకు వచ్చారు.

అయితే పార్టీలో యువత లేదా అంటే ఉంది. మహబూబ్ నగర్ నుండి రేవంత్ రెడ్డి, కృష్ణా జిల్లా నుండి దేవినేని ఉమా మహేశ్వరరావు, పయ్యావుల కేశవ్ తదితరులు ఉన్నారు. కేవలం ముగ్గురు నలుగురు మాత్రమే యువత పార్టీలో ప్రధానంగా కనిపిస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లో మొత్తం సీనియర్లదే హవా. వరంగల్ జిల్లా నుండి ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, శ్రీకాకుళం నుండి ఎర్రన్నాయుడు, విజయనగరం నుండి అశోక గజపతి రాజు, ఖమ్మం నుండి తుమ్మల నాగేశ్వరరావు, తూర్పు గోదావరి నుండి యనమల రామకృష్ణుడు, గుంటూరు నుండి కోడెల శివప్రసాదరావు, ప్రకాశం నుండి కరణం బలరాం, కర్నూలులో కెఇ బ్రదర్స్ ఇలా దాదాపు 60కి పైగా సెగ్మెంట్లలో నాటి వారిదే పార్టీ ఆవిర్భావం నుండి హవా. సీనియర్లకు ప్రజాధరణ ఏ మేరకు ఉన్నదో తెలియదు. కానీ వారికే ప్రాధాన్యత. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ యువత తీవ్ర నిరూత్సాహంలో ఉంటోంది. దీంతో వారు కొత్తగా వస్తున్న, యువతకు ప్రాధాన్యం ఇస్తున్న పార్టీల వైపు చూస్తున్నారు. యువతలో హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు పొంది వారి ఆదరణ చూరగొంటున్న బాబు 17 ఏళ్లుగా అధ్యక్ష పీఠంపై ఉన్నప్పటికీ ఇప్పటికీ వారికి సరైన ప్రాధాన్యం కల్పించలేక పోయారు. గత రెండు ఎన్నికల్లో చంద్రబాబుకు విరుద్దంగా దివంగత వైయస్ కొత్త ముఖాలకు టిక్కెట్లు కేటాయించి విజయం సాధించారు.

చాలా నియోజకవర్గాల్లో సీనియర్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వారికి ప్రత్యామ్నాయంగా ఎవరూ లేక పోవడంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తెలంగాణ వాదంతో ఇటీవలే బహిష్కరించబడిన ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి బయటకు వచ్చిన తమ్మినేని సీతారం, దేవేందర్ గౌడ్, ఇనుగాల పెద్దిరెడ్డి, కళా వెంకట్రావులపై ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. గుంటూరు జిల్లా టిడిపిలో అతి ముఖ్యమైన నేతగా ఉన్న మాకినేని పెద్దరత్తయ్యకు ప్రత్యామ్నాయం లేకుండా పోవడంతో అక్కడ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇలా ఎక్కడికక్కడ యువతను నిర్లక్ష్యం చేస్తూ సీనియర్లకే ప్రాధాన్యత ఇవ్వడం ఆ విధేయత లేని సీనియర్లు తమ స్వప్రయోజనాలతో పార్టీలు మారుస్తూ ఉండటంతో పార్టీ పలు నియోజకవర్గాలలో పట్టు కోల్పోతుంది.

English summary
Telugudesam party is neglecting youth in party. Chandrababu is not take interest to encourage young people in party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X