బాబు రెండు కళ్ల కుంపటి, నేతల మధ్య తిట్ల పురాణం
పయ్యావుల కేశవ్పై తెలుగుదేశం తెలంగాణ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కేశవ్ ఉచిత సలహాలు తమకు అవసరం లేదని మాజీ మంత్రి, సీనియర్ నేత కడియ శ్రీహరి అన్నారు. తెలంగాణ ప్రజల దృష్టిలో పయ్యావుల కేశవ్ ఒక చీడపురుగులా మిగిలిపోవద్దని ఎర్రబెల్లి దయాకర్ రావు హితవు పలికారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమాన్ని చేసుకోవడంలో తప్పులేదని, అయితే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న తమపై వారు పోరాటం చేయడం ఎంత వరకు సబబని ఎర్రబెల్లి ప్రశ్నించారు. తెలంగాణ కోసం తెలంగాణ తెలుగుదేశం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. తమ భవిష్యత్ ప్రణాళికను ఈనెల 31వ తేదీన ఇందిరాపార్కు వద్ద జరిగే సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. ఆగస్టు ఒకటో తేదీన ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా చేస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
కాగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయడం వల్ల ఒరిగేది ఏమీ లేదని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్ర కోసం తిరుపతిలో మంగళవారం జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రాంత నేతలు రాజీనామాలతో ఏమీ సాధించలేరని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు. వీరి రాజీనామాలకు బెదిరేది ఎవరని ఆయన ప్రశ్నించారు. రాజీనామాలతో రాజకీయ సంక్షోభం రాదన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి తెలంగాణ ప్రాంత రాజీనామాలు సరిపోవన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు రాజీనామా చేస్తే మాత్రం కేంద్ర తక్షణం స్పందించక తప్పదన్నారు. లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనుగడ ఉండదని పయ్యావుల జోస్యం చెప్పారు. ఇదే విషయం గత 2009 డిసెంబరులో రుజువైందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ముక్కలు కానివ్వమన్నారు. ఒకవేళ అలాంటి చర్యకు కేంద్రం పూనుకుంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పయ్యావుల హెచ్చరించారు.