వైయస్ జగన్ కాంగ్రెసులోకి వస్తారా?
తిరిగి కాంగ్రెసులోకి వచ్చేందుకు జగన్ ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేయరనేది పరిస్థితులు తెలియజేస్తూనే ఉన్నాయి. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని లక్ష్యం చేసుకుని జగన్ విమర్శలు చేస్తున్నారు. ఆయన సాక్షి మీడియాలో కూడా కాంగ్రెసుకు వ్యతిరేకంగా వార్తాకథనాలు ఎడతెరిపి లేకుండా వస్తున్నాయి. ఒకవేళ తాను కాంగ్రెసులోకి రావాలనుకుంటే కాంగ్రెసు అధిష్టానం, చెప్పాలంటే సోనియా గాంధీ లొంగిరావాల్సి ఉంటుంది. ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాల్సింది. లేదంటే, కనీసంగా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) పదవి అప్పగించి 2014 ఎన్నికల్లో జగన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాల్సి ఉంటుంది. జగన్ బ్లాక్ మెయిల్ తరహా రాజకీయాలకు సోనియా గాంధీ లొంగుతారని అనుకోవడానికి ఏమీ లేదు. తమకు విధేయంగా ఉంటేనే పదవులు వస్తాయని సోనియా ఆచరణలో చూపిస్తూ వస్తున్నారు. అందుకు భిన్నంగా సోనియా వ్యవహరించే పరిస్థితి లేదు.
ఇప్పుడు కాకున్నా, 2014 ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలనేది జగన్ లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా పరిస్థితులు లేకపోతే ఆయన అంగీకరించరనేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా, జగన్కు కాంగ్రెసు అధిష్టానం కాస్తా అనుకూలంగా ఉన్నా, మధ్యవర్తుల ద్వారా జగన్ను తిరిగి పార్టీలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ వి. హనుమంతరావు గానీ జగన్పై అంతగా దాడి చేయరు. ముఖ్యమంత్రి మాటేమో గానీ హనుమంతరావు మాత్రం జగన్పై అంతగా విమర్శలు చేయరు. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తప్ప కిరణ్ కుమార్ రెడ్డి, హనుమంతరావు జగన్కు వ్యతిరేకంగా అంత తీవ్రస్థాయిలో మాట్లాడబోరనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.