తెలంగాణపై వైయస్ తోవలో కిరణ్?
దీనికోసం అభివృద్ధి అంశాన్ని తెర మీదికి తెచ్చేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా ప్రజలు అభివృద్ధినే కోరుకుంటున్నారని అభిప్రాయపడిన నేపథ్యంలో దాన్ని ముందుకు తెచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ను దెబ్బ కొట్టాలనే వ్యూహంతో ముఖ్యమంత్రి ఉన్నట్లు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి వంద రోజుల ప్రణాళిక అందులో ఓ భాగమని చెబుతున్నారు. తాము అభివృద్ధిని కోరుకుంటున్నామని చెప్పేందుకు కాంగ్రెసులో తెలంగాణ నుంచి ఓ వర్గాన్ని ముందుకు తెచ్చేందుకు ఆయన సమయాత్తమవుతున్నారు. గతంలో వైయస్సార్ ఇదే తరహాలో వ్యవహరించారు. తెలంగాణ డిమాండ్ కాంగ్రెసులో ముందుకు వచ్చిన ప్రతిసారీ వైయస్సార్కు అనుకూలంగా వ్యవహరించే కాంగ్రెసులోని జూనియర్ నేతల వర్గం ముందుకు వచ్చేది.
తాము అభివృద్ధిని కోరుకుంటున్నామని, అభివృద్ధి చెందిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుందామని, అభివృద్ధి చెందని తెలంగాణ రాష్ట్రం అవసరం లేదని వారు వాదిస్తూ ఉండేవారు. ఆ మేరకు కాంగ్రెసు అధిష్టానం వద్దకు తెలంగాణవాదులకు పోటీగా వారు కూడా వెళ్తుండేవారు. ఇదే తరహా వర్గాన్ని తెలంగాణ నుంచి ఏర్పాటు చేసుకునేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇందులో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ నాయకులతో విడివిడిగా సమావేశమవుతూ వారి మనసు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఇటీవల ఆయన తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపిస్తున్న శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డితోనూ పార్లమెంటు సభ్యుడు కె. కేశవ రావుతోనూ సమావేశమయ్యారు. తెలంగాణవాదంతో కాంగ్రెసు నాయకులను తెలంగాణ ప్రాంతంలో అడ్డుకునే శక్తులను ఎదుర్కోవడానికి అవసరమైన యంత్రాంగాన్ని కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
వైయస్సార్ హయాంలో మంత్రులు దానం నాగేందర్, దామోదరం రాజనర్సింహ వంటి మంత్రులను తెలంగాణలో అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు వైయస్సార్ కౌంటర్ తెలంగాణవాదులను వెనక్కి తగ్గేలా చేసింది. అయితే, ఇప్పుడు ఈ వ్యూహం అంతగా ఫలితం ఇవ్వకపోవచ్చునని అంటున్నారు. వైయస్సార్కు ఉన్నంత వీర విధేయులు కిరణ్ కుమార్ రెడ్డికి లేరు. దానికితోడు, తెలంగాణవాదం అప్పటి కన్నా ఇప్పుడు మరింత బలంగా ఉంది. తెలంగాణవాదులు ఎంతటికైనా తెగించేందుకు ఇప్పుడు సిద్ధమయ్యారు. తెలంగాణకు వ్యతిరేకంగా వినిపించే ఏ వాదనను కూడా వారు వినే స్థితిలో లేరు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ నరసింహన్ ఉద్బోధలు బాగా పనికి వస్తున్నాయని అంటున్నారు.