చంద్రబాబుకు భయమెందుకు?

Chandrababu Naidu
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పనితీరు మారలేదని మరోసారి రుజువైంది. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో తలెత్తిన విభేదాల తీరు, వాటిని పరిష్కరించడానికి ఎవరూ ముందుకు రాని వైనం ఆ విషయాన్ని మరోసారి పట్టిస్తోంది. పార్టీని ముందుకు నడిపించడానికి గానీ, పార్టీలో తలెత్తిన విభేదాలను పరిష్కరించడానికి చంద్రబాబు తప్ప మరొకరు లేరనే విషయం మరోసారి బయటపడింది. చంద్రబాబు ఇతర పనుల్లో తీరిక లేకుండా ఉన్నా, విదేశాలకు వెళ్లినా వ్యవహారాలను చూసే రెండో నాయకుడు లేకుండా పోయాడు. ప్రస్తుతం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉన్నారు. సింగపూర్ నుంచి పార్టీ కార్యాలయానికి సమాచారం ఇచ్చి, హెచ్చరిక చేస్తూ ఆయన కృష్ణా జిల్లా నాయకుల విభేదాలపై ఓ ప్రకటన విడుదల చేయించారు.

పార్టీలో నెంబర్ టూ లేకపోవడం వల్ల సమస్యలు తీవ్రమవుతున్నాయనే విషయాన్ని ఆయన గుర్తించారా, లేదా అనేది అనుమానమే. అయితే, నెంబరు టూ వల్ల తెలుగుదేశం పార్టీలో నెంబర్ వన్‌కు ఎసరు వస్తుందనే భయం ఆయనను పట్టి పీడిస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు చెప్పే దాకా కదలని స్థితి పార్టీలో ఉంది. ఏం చేస్తే చంద్రబాబు ఏమంటారో తెలియని వాతావరణం పార్టీలో ఉంది. చంద్రబాబు చెప్పకుండా వ్యవహారాల్లో తలదూరిస్తే ఎదురయ్యే నష్టాన్ని నాయకులు గుర్తించి వాటికి దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. గతంలో దేవేందర్ గౌడ్‌కు ఎదురైన సమస్య ఇంకా పార్టీలో తొలగిపోలేదు. చంద్రబాబుపై నక్సలైట్లు దాడి చేసినప్పుడు చొరవ చూపి దేవేందర్ గౌడ్ సమావేశాలు ఏర్పాటు చేశారు. అప్పుడు ఆయన హోం మంత్రిగా ఉన్నారు. అయినా, పెద్ద వివాదమే చెలరేగింది. క్రమంగా దేవేందర్ గౌడ్ తోకను చంద్రబాబు కత్తిరిస్తూ వచ్చారని అంటారు.

నెంబర్ టూ స్థానానికి ఎవరిని ఎదగనిచ్చినా తన నాయకత్వానికి ప్రమాదం వాటిల్లుతుందని చంద్రబాబు భయపడుతున్నట్లు చెబుతున్నారు. ఎన్టీ రామారావు హయాం నుంచి ఇదే జరుగుతూ వస్తోంది. మొదట నాదెండ్ల భాస్కర రావు, ఆ తర్వాత పర్వతనేని ఉపేంద్ర, అనంతరం నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఆ తర్వాత కె. జానా రెడ్డి ఒక్కరొక్కరే గోతులు తవ్వుతూ పోయారని అంటారు. నాదెండ్ల భాస్కర రావు అనుభవంతో మిగతా ముగ్గురిని ప్రమాదం వాటిల్లక ముందే పార్టీ నుంచి సాగనంపినట్లు, ఇందులో చంద్రబాబు ప్రధాన పాత్ర పోషించినట్లు చెబుతారు. చివరగా, పార్టీలో నెంబర్ టూగా ఎదిగిన చంద్రబాబు ఎన్టీ రామరావు కుర్చీకి ఎసరు పెట్టారని అంటారు. పార్టీలో నెంబర్ టూను ఎదగనిస్తే తనకు కూడా అదే పరిస్థితి ఎదురు కావచ్చునని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతుంటారు. అందువల్లనే ఎవరినీ చొరవ ప్రదర్శించనీయరని చెబుతారు.

ఎన్టీ రామారావు నుంచి అధికారాన్ని చేజిక్కించుకునే సమయంలో తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు ఉప ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు హామీ ఇచ్చారని సమాచారం. అలా ఇస్తే, పక్కన బల్లెం పెట్టుకున్నట్లేనని బావించి దగ్గుబాటి పార్టీని వీడిపోయే విధంగా చేశారని చెబుతారు. ఆ తర్వాత హరికృష్ణను కూడా రాజ్యసభ పదవికి మాత్రమే పరిమితం చేసి, పార్టీ వ్యవహారాల్లో చేయి పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారని సమాచారం. ఏమైనా, చంద్రబాబు మరొకరిని నమ్మరని అంటారు. అందుకే, పార్టీ ముందుకు సాగడం లేదనేవారు కూడా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+