జగన్ వర్గం ఎమ్మెల్యేల్లో టెన్షన్
అవసరమైన సమయంలో జగన్ వెంట నడవడానికి కాంగ్రెసు పార్టీలో సగం మంది ఉన్నారని చెప్పినప్పటికీ ఫీజు పోరులో ఇరవై మూడుకి మించలేదు. పార్టీ పెట్టాక కూడా వారిలో ఎంత మంది ఉంటారో, ఎంత మంది వెళతారో తెలియదు. పిల్లి సుభాష్ చంద్రబోస్, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కమలమ్మ తదితరుల నేతలు జగన్ వెంట వెళ్లడానికి రాజీనామాలకు దేనికైనా సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయన వర్గంలోని మరికొందరు మాత్రం రాజీనామాలపై, పార్టీ ఫిరాయింపుల చర్యలకు సిద్ధంగా ఉన్నట్టు కనపడటం లేదు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో పోటీ చేస్తే మళ్లీ గెలుస్తామో లేదో అనే సందేహంతో తెలంగాణలో ఆయన వెంట వెళుతున్న వారు వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో ఉన్న ఇద్దరు సిఎం కిరణ్కుమార్ రెడ్డితో గతంలో మంతనాలు చేసినప్పటికీ దారికి రాలేదు. అయితే వారు జగన్ పార్టీ పెట్టాక పార్టీ ఫిరాయింపుల చట్టానికి భయపడైనా వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయి.
ఇక జగన్ వర్గం అతిముఖ్యమైన నేత కొండా సురేఖ ఇటీవల పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్, ముఖ్యమంత్రితో భేటీ కావడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె మాటల్లో కూడా గతంలో కంటే పదును తగ్గిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక సీమాంధ్రలో సైతం జగన్ వెంట వెళుతున్న ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపుల చట్టం భయపెడుతోంది. కాంగ్రెసు, టిడిపి వారు జగన్ పార్టీ పెట్టాక కూడా ఆయన వెంట సీమాంధ్ర ఎమ్మెల్యేలు వెళితే ఆ చట్టాన్ని ఉపయోగించుకుంటారు. కాంగ్రెసు పార్టీ రెండుగా విడిపోయినందున, టిడిపి వారికి వ్యక్తిగతంగా వారి వారి నియోజకవర్గాల్లో పెద్దగా వ్యక్తిగత ప్రతిష్ట లేదన్న నేపథ్యంలో మళ్లీ గెలిచే అవకాశాలు చూసుకునే జగన్ వెంట నడిచేందుకు సిద్ధ పడతారు. అయితే పీఆర్పీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డిలకు మాత్రం చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తానని ప్రకటించడం వారికి ఆనందం కలిగించే విషయం. చిరు కాంగ్రెసులో చేరితే వారు చిరు వెంట వెళ్లాల్సిన అవసరం లేదు, స్వతంత్ర సభ్యులుగా అవుతారు. అయితే పార్టీ ఇంకా అధికారికంగా విలీనం చేయనందున వారి భవితవ్యం ముందు ముందు తేలనుంది.