మధ్యంతరంపైనే జగన్, కెసిఆర్
తెలంగాణకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యులు రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చి తీరుతుందని కెసిఆర్ గట్టిగా నమ్ముతున్నారు. కాంగ్రెసు అధిష్టానం గానీ కేంద్ర ప్రభుత్వంగానీ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించే స్థితి లేదు. సమైక్యవాదంవైపు మొగ్గు చూపే వాతావరణమే కనిపిస్తోంది. దీంతో కాంగ్రెసు అధిష్టానానికి తన సత్తా చాటేందుకు మధ్యంతర ఎన్నికలు వస్తే బాగుండుననేది ఆయన తాపత్రయం. అయితే, కాంగ్రెసు శాసనసభ్యులు రాజీనామాలకు సిద్ధంగా లేరు. కానీ, తెలంగాణ సాధిస్తామని అంటున్నారు. కాలయాపన చేసే దిశగానే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు సాగుతున్నారు. దీంతో కాంగ్రెసు నాయకులు తెలంగాణలో అడుగు పెట్టకుండా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు రాజీనామా చేస్తే రాజకీయ సంక్షోభం తలెత్తి, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలనేది కెసిఆర్ ఆలోచనగా చెప్పవచ్చు. తెలంగాణ ప్రాంత శానసభ్యులు రాజీనామాలకు ముందుకు వస్తే, వైయస్ జగన్ వర్గం కూడా అందుకు సిద్దపడవచ్చునని, తద్వారా మధ్యంతర ఎన్నికలకు దారులు పడితే బాగుండుననేది ఆయన ఆశగా చెబుతున్నారు.
కాగా, 2014 వరకు తాము కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చబోమని వైయస్ జగన్ వర్గం చెబుతూ వస్తోంది. అయితే, ఈలోగా దానంతటదే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని జగన్ వర్గం నాయకులు అంటున్నారు. అలా ఎలా కూలిపోతుందో, వారు ఎందుకు అలా అనుకుంటున్నారో కచ్చితంగా చెప్పలేం గానీ తెలంగాణ అంశంపై ప్రభుత్వం పడిపోవచ్చునని జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి ఒకానొక సందర్భంలో అన్నారు. ప్రభుత్వాన్ని తాము అధికారం కోసం కూల్చామనే అపవాదు నుంచి బయటపడాలనే ఉద్దేశంతోనే జగన్ వర్గం నాయకులు ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అవసరమైన చేయూత మాత్రం అందించేందుకు మాత్రం వెనకాడకపోవచ్చు.
ప్రస్తుత వాతావరణంలో తెలుగుదేశం పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తుందేమోనని కెసిఆర్, జగన్ ఎదురు చూస్తున్నట్లు అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ఆశలు రేకెత్తించారు. తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని చెప్పారు. కానీ వెనక్కి తగ్గారు. పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని, మధ్యంతరం వస్తే సీమాంధ్రలో వైయస్ జగన్ సానుభూతి వల్ల, తెలంగాణలో సెంటిమెంట్ వల్ల కెసిఆర్ సీట్లన్నీ తన్నుకుపోతారని భావించి చంద్రబాబు ఆ ప్రయత్నం నుంచి విరమించుకున్నట్లు చెబుతున్నారు. అందుకే, తెలంగాణకు వ్యతిరేకంగా కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు కుమ్మక్కయ్యారని తెరాస నాయకులు ఆరోపిస్తున్నారు. ఏమైనా, రాష్ట్రంలో మాత్రం అస్థిర పరిస్థితి కొనసాగుతుందనేది తెలిసిపోతూనే ఉన్నది.