చంద్రబాబు దారిలో నీళ్లు కుమ్మరిస్తున్నారు
ప్రతి రోజు 5 వేల లీటర్ల సామర్థ్యం గల 12 వాటర్ ట్యాంకర్లను, 20 వేల లీటర్ల సామర్థ్యం గల రెండు లారీ ట్యాంకర్లను నీటి కోసం వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ట్యాంకర్లు రోజుకు రెండు ట్రిప్పులు వేస్తున్నాయట. మెటల్ రోడ్డుకు పక్కన ఉన్న పొదలను తొలగించడానికి రెండు బ్లేడ్ ట్రాక్టర్లను కూడా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. నీళ్లను రోడ్డు పక్కల ఉండే బోర్వెల్స్ నుంచి తెస్తున్నట్లు చెబుతున్నారు.
పాదయాత్ర చేరుకోవడానికి అర గంట ముందు నీళ్లు చల్లుతున్నారు. దాంతో దుమ్ముధూళీ రేగకుండా సాఫీగా ఉంటుంది. ప్రతి రోజూ పాదయాత్ర ప్రారంభం నుంచి ముగిసే వరకు ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. ప్రతి రోజు 15 కిలోమీటర్ల మేర నీళ్లతో బాటను తడుపుతూ ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన బర్రా రాఘవరావు ఈ పనిచేస్తున్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో వార్త వచ్చింది.
స్థానిక రైతులు స్వచ్ఛందంగా నీళ్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారట. తెలుగుదేశం నాయకులు పత్తిపాటి పుల్లారావు, అనగాని సత్యప్రసాద్, గరికపాటి మోహన్ రావు ఉచితంగా ట్రాక్టర్లను సమకూర్చారని సమాచారం. ట్రాక్టర్లకు రోజుకు దాదాపు 300 లీటర్ల డీజిల్ అవసరం అవుతోంది. ఆ రకంగా రోజుకు డీజిల్ కోసం 16 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని దక్కన్ క్రానికల్ రాసింది.