మ.నగర్ రసవత్తరం: టిఆర్ఎస్కు బిజెపి ఛాలెంజ్
పట్టణ ప్రాంత ఓటర్లలో ప్రధానంగా బిజెపి, టిఆర్ఎస్ వైపు మొగ్గు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ ఓటు కారణంగా కాంగ్రెసు, టిడిపిలు ముందున్నాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటు అభివృద్ధి ముఖ్యమని కాంగ్రెసు చెబుతుండగా, తెలంగాణకు తమ పార్టీ అడ్డు కాదని, కేంద్రం నిర్ణయం తీసుకోవాలని టిడిపి చెబుతోంది. ఇక టిఆర్ఎస్ తెలంగాణ తెచ్చేది మేమే అని చెబుతుండగా, బిజెపి ఒక అడుగు ముందుకేసి ఒక్కచోట టిఆర్ఎస్ ఓడినా ఉద్యమానికి వచ్చే నష్టమేమీ లేదని, మిగిలిన చోట్ల వారికి మేం మద్దతు ఇస్తున్నాని, మ.నగర్లో బిజెపిని గెలిపించి జాతీయస్థాయిలో కాంగ్రెసుకు కనువిప్పు కలిగించాలని ఓటర్లను కోరుతున్నారు. కాంగ్రెసు ఇవ్వని పక్షంలో తెలంగాణ ఇచ్చేది మేమే అని చెబుతున్నారు. దీంతో తెలంగాణ సెంటిమెంట్పై ఆధిపత్యం కోసం ఇరు పార్టీ మధ్య హోరా హోరి నడుస్తోంది.
టిఆర్ఎస్ తరఫున మైనార్టీ అభ్యర్థిని నిలబెట్టడంతో ఆ వర్గం ఓట్లు ఆ పార్టీకి గణనీయంగా పడే అవకాశముందని అంటున్నారు. అయితే కాంగ్రెసు, టిడిపికి ఉన్న ఆ వర్గం సంప్రదాయ ఓటర్లు మొగ్గితేనే అది జరుగుతుంది. టిఆర్ఎస్కు జమాతే ఇస్లామీ హింద్ మద్దతు పలికింది. ఈ పరిస్థితితో మరో వర్గం ఓటర్లు బిజెపి వైపు మొగ్గుతున్నారని అంటున్నారు. జెఏసి, విద్యార్థులు తదితరులు జాతీయ పార్టీ అయిన తమ పార్టీ వైపే ఉన్నారని బిజెపి చెబుతోంది. స్థానిక జిల్లా జెఏసి ఇప్పటికే బిజెపి, టిఆర్ఎస్లలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిందని, ఆ ప్రకారమే అవి పని చేస్తున్నాయని అంటున్నారు.