మద్యం సిండికేట్లు, ప్రధానితో బొత్స భేటీ
పిసిసి అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత బొత్స సత్యనారాయణ ప్రధానిని కలుసుకోలేదు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఆయన ప్రధానిని కలిసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఆజాద్తో సమావేశమవుతారు. ఆజాద్తో మద్యం సిండికేట్లపైనే కాకుండా విగ్రహాల విధ్వంసంపై, తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాల విధ్వంసం రాజకీయ రంగును పులుముకుంది. ఈ విగ్రహాల విధ్వంసం వెనక కాంగ్రెసు పార్టీ నాయకుల పాత్ర ఉన్నట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అలాగే, యానాం ఘటన కూడా కలకలం రేగుతోంది. యానాం రీజెన్సీ సిరామిక్స్ ఘటనలో కార్మిక నాయకుడు మురళీమోహన్, సంస్థ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ మరణించారు. ఈ ఘటనకు సంబంధించి కార్మిక నాయకుల సంఘం గౌరవాధ్యక్షుడు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్పై ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్నింటిపై బొత్స సత్యనారాయణ ఆజాద్కు వివరించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.