ఎనిమిది సీట్లలో జగన్కు కష్టాలు: కులమే కారణం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రైవేట్గా నిర్వహించిన సర్వేనే ఆ విషయాన్ని తేల్చినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. రామచంద్రాపురం, పాయకరావుపేట, నర్సాపురం శాసనసభా స్థానాల్లో కాంగ్రెసు నుంచి, రాయదుర్గం, అనంతపురం, రాయచోటి, రాజంపేట, తిరుపతి స్థానాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతోందని అంటున్నారు. అనర్హత వేటు పడినవారినే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బరిలోకి దింపాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
కాపు రామచంద్రా రెడ్డి పోటీకి విముఖత ప్రదర్శిస్తుండడంతో రాయదుర్గం కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వేటలో పడింది. ప్రైవేట్ సర్వే ప్రకారం తెలుగుదేశం 3 శాతం ఓట్లు అధికంగా సాధించే అవకాశం ఉంది. దాంతో ఈ సీటు కోసం రెడ్డి లేదా బిసి కమ్యూనిటీ నుంచి మంచి ఇమేజ్ ఉన్న అభ్యర్థి కోసం జగన్ అన్వేషణ ప్రారంభించారు.
రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో కుల ప్రాతిపదికపై కాంగ్రెసు పార్టీకి ఆధిక్యత కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. నర్సాపురం, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యత ప్రదర్శించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అయితే, రాజంపేటలో తెలుగుదేశం పార్టీ బలిజ అభ్యర్థిని రంగంలోకి దింపుతోంది. దీంతో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు మధ్య రెడ్ల ఓట్లు చీలుతాయని అంటున్నారు. రాజంపేట సీటును బలిజ వర్గానికి ఇవ్వాలనే డిమాండ్ వచ్చినప్పటికీ అందుకు విరుద్ధంగా ఆ రెండు స్థానాలకు కాంగ్రెసు అభ్యర్థులను నిర్ణయించింది.
ఆ రెండు నియోజకవర్గాల్లో రెడ్లు అత్యధికులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వెళ్లారని, దాని వల్ల రెడ్డిని నిలబెట్టడం వల్ల కాంగ్రెసుకు నష్టం జరుగుతుందని గత ప్రజారాజ్యం పార్టీకి చెందిన కాంగ్రెసు నాయకులు వాదిస్తున్నారు. దీంతో బలిజలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారనే వాదన వినిపిస్తోంది.
నర్సాపురంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ప్రసాద రాజుపై కాంగ్రెసు అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడుది పైచేయి అవుతుందని అంటున్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ విలీనం కావడంతో కొత్తపల్లి సుబ్బారాయుడు కాంగ్రెసు నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి అయిన కొత్తపల్లి సుబ్బారాయుడిని తట్టుకోవడం ప్రసాద రాజుకు కష్టమేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications