మంత్రులకు నోటీసులపై ఎమ్మెల్యేల్లో ఆందోళన
సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడాన్ని చిన్న విషయంగా చూస్తున్నారా అని వారు మంత్రిని అడిగారు. మంత్రులు, అధికారులు వ్యక్తిగతంగా సమాధానాలు ఇచ్చుకుంటారనే పద్ధతిలో వ్యవహరించడం పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదని వారు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గానీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ సభా కార్యక్రమాలను స్తంభింపజేస్తుంటే ఎందుకు మాట్లాడడం లేదని వారడిగారు. జగన్ వేయించిన కేసు వల్ల ఈ పరిస్థితి వచ్చిందని రఘువీరా రెడ్డి అన్నట్లు సమాచారం. ఈ సమయంలో ఆవేశం వద్దని కొత్త ఎమ్మెల్యేలను రఘువీరా వారించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత కన్పించట్లేదని.. దాన్ని సొమ్ము చేసుకోవాల్సిన అవసరం ఉందని రఘువీరా సూచించారు. ఇందులో భాగంగా కొత్త ఎమ్మెల్యేలంతా కలసి బస్సు యాత్రను చేపట్టాలని సలహా ఇచ్చారు.
శాసనసభ శీతాకాల సమావేశాల్లో చంద్రబాబు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి జగన్వర్గ ఎమ్మెల్యేలు ఓటు వేస్తే బాబు నీతిమంతుడిగా బయటపడే విధంగా న్యాయస్థానంలో జగన్ కేసు వేశారని వివరించారు. ఇప్పుడు జగన్ వేసిన కేసుపై సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసిన వెంటనే మంత్రులు రాజీనామా చేయాలంటూ తెలుగుదేశం గొడవ చేస్తోందని, ఇదంతా ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే జరుగుతోందని ప్రజలకు తెలియజెప్పాలని రఘువీరా సూచించారు.