ఫొటో ఫీచర్: యువనేతల పొలిటికల్ టార్గెట్స్
హైదరాబాద్: రాజకీయాల్లోకి యువ రక్తం ప్రవహిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. పాత తరం రాజకీయ నేతలను పక్కకు తప్పించి, రాజకీయాలను తమ చేతుల్లోకి తీసుకోవడానికి యువ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకు తగిన శ్రమ కూడా చేస్తున్నారు. దేశ రాజకీయాలను తన ఒంటి చేతి మీద నడిపించడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తనయుడు రాహుల్ గాంధీ సిద్ధపడితే, తన తండ్రి స్థానంలో సమాజ్వాదీ పార్టీని ఉత్తరప్రదేశ్లో విజయపథంలో నడించిన అఖిలేష్ యాదవ్ ఇప్పుడు పెద్ద ఆకర్షణ.
అఖిలేష్ యాదవ్ చాలా మంది యువనేతలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. దేశ రాజకీయాల మాట అలా ఉంచితే, రాష్ట్ర రాజకీయాల్లో యువ నేతలు తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలను శాసించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైలులో ఉంటూ తన పార్టీని నడిపిస్తూ వచ్చే ఎన్నికలను టార్గెట్గా పెట్టుకున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీలకు ఆయన సవాల్ విసురుతున్నారు.
ఇక, తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు ఊపందుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి స్థానంలోకి రావాలని ఆయన తనయుడు నారా లోకేష్ తెగ ప్రయత్నాలు సాగిస్తుంటే, ఆ పార్టీ వ్యవస్థాపకుడైన తన తాత ఎన్టీ రామారావు వారసత్వాన్ని అందుకోవాలని సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నారా లోకేష్ తన కొత్త విధానాల వల్ల రాజకీయాలను తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటే, తన ఇమేజ్నే ప్రధానంగా ఎంచుకుని జూనియర్ ఎన్టీఆర్ టాస్ వేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు ప్రధాన మంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ ముందుకు వస్తున్నారు. కాకలు తీరిన మన్మోహన్ సింగ్ స్థానంలో వచ్చే ఎన్నిక్లలో పార్టీని విజయ పథాన నడిపించి ప్రధాన మంత్రి పదవిని అధిష్టించే లక్ష్యంతో రాహుల్ గాంధీ కసరత్తు సాగిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెసు జయాపజయాల బాధ్యతను ఆయన భుజాన మోస్తున్నారు. ఇందులో భాగంగా, నగదు బదిలీ పథకాన్ని ముందుకు తెచ్చి ప్రజల మనసులో దోచే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నగదు బదిలీ పథకంపై ప్రజలకు వివరించడానికి ఆయన దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెసు నాయకులకు అవగాహనా సదస్సు నిర్వహించారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ తనయుడు అఖిలేష్ యాదవ్ తన ముద్రను వేయాలని చూస్తున్నారు. తండ్రి వెనక ఉంటూ రాష్ట్రంలోని యువతను పార్టీ వైపు నడిపించడంలో ఆయన తీవ్రమైన కృషే చేశారు. సైకిల్ యాత్రల ద్వారా ప్రజల్లో తన ఇమేజ్ను పెంచుకున్నారు. త్రిశంకు అసెంబ్లీ ఏర్పడుతుందని భావించిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల అంచనాలను తారుమారు చేస్తూ భారీ మెజారిటీ సాధించిన ఘనతను అఖిలేష్ యాదవ్ కొట్టేశారు. పాలనాదక్షుడిగా నిలదొక్కుకుని తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నారు.

ఇక రాష్ట్రం విషయానికి వస్తే, ఢిల్లీ పెద్దలను ధిక్కరించి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడానికి 2014 ఎన్నికలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లడానికి ఆయన ఓదార్పు యాత్ర, దీక్షలను వాహకంగా వాడుకున్నారు. అక్రమాస్తుల కేసులో జైలు పాలైనా ఆయన రాజకీయాల్లో ఆధిక్యతను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నారు.

చాలా కాలం వరకు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తండ్రి చాటు బిడ్డ. గత ఎన్నికల్లో ఆయన పార్టీ వ్యవహారాల్లో చేయి చేసుకున్నారు. పార్టీకి విజయం చేకూర్చి పెట్టేందుకు చంద్రబాబు ప్రకటించిన నగదు బదిలీ పథకం లోకేష్ బుర్రలోనే పుట్టిందని అంటున్నారు. తండ్రి చంద్రబాబు పాదయాత్ర చేస్తుంటే ఇప్పుడు ఆయన పార్టీలో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తూ మార్గదర్శకత్వం చేస్తున్నట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికలను టార్గెట్గా పెట్టుకున్న ఈయన జూనియర్ ఎన్టీఆర్ నుంచి వారసత్వ పోరును ఎదుర్కుంటున్నారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాల్సి వస్తే, లక్ష్యాన్ని సాధించే విషయంలో మొండిగా వ్యవహరిస్తారని అంటారు. నందమూరి కుటుంబంలోకి తెలివిగా ప్రవేశించిన, రాజకీయాల్లో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తన తాత లాగా తుఫాను సృష్టించాలనేది ఆయన కోరిక అని చెబుతారు. తాతనే ఆయనకు ఆదర్శం. రాజకీయాల్లో ఆధిపత్యానికి ఆయన 2019 ఎన్నికలను టార్గెట్గా పెట్టుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications