జెడి కాల్ లిస్టు: జగన్ పార్టీ మరో కథ
వైయస్సార్ కాంగ్రెసు శాసనసభా పక్షం పేరిట ఈనెల 21న 'జననేతపై మహా కుట్రకు నిరసనగా సత్యాగ్రహం' శీర్షికతో ఒక పత్రికా ప్రకటన, దానికి అనుబంధంగా సిబిఐ జెడి లక్ష్మీనారాయణ సెల్ఫోన్ కాల్స్ వివరాలను మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో లక్ష్మినారాయణ కాల్ లిస్టు ఎలా లీకయిందనే విషయం చర్చనీయాంశంగా మారింది. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు దానికి వివరణ ఇచ్చే పనికి పూనుకున్నారు.
"లీడ్ ఇండియా ముసుగులో జగన్పై కుట్ర జరుగుతోంది. జేడీ కాల్ లిస్టును తెచ్చింది మేం కాదు. అది కోర్టుకు ఎవరో సమర్పించిన పబ్లిక్ డాక్యుమెంట్. దానిని కోర్టు నుంచి తీసుకున్నాం. ఓ వ్యక్తి కోర్టులో వేసిన పిల్లో సీబీఐ జేడీ ఏ మీడియాతో మాట్లాడారో తెలియజేశారు. పార్టీకి చెందిన కొంతమంది అభిమానులు ఆ కాల్ లిస్టును మాకు ఇచ్చారు. మా పార్టీకి వేల, లక్షల అభిమానులు ఉన్నారు. రాష్ట్రంలో ఏ మూల నుంచి అయినా సమాచారం ఇస్తూ ఉంటారు. అది పోలీసులు, సాక్షి చానెల్ ఇచ్చిన సమాచారం కాదు'' అని శోభా నాగిరెడ్డి చెప్పారు.
జెడి లక్ష్మీనారాయణ కాల్స్ లిస్ట్ తెచ్చింది తాము కాదని, ఆయన వ్యక్తిగత జీవితంలోకి తాము ప్రవేశించలేదని శ్రీకాంత్రెడ్డి చెప్పారు. "తారా చౌదరి వ్యవహారం బయటకు వచ్చినప్పుడు పలు చానళ్లు ఆమె కాల్స్ లిస్ట్ను బయట పెట్టలేదా? అది తప్పు కాదా? వాసిరెడ్డి చంద్రబాల కాల్ లిస్ట్ బయట పెట్టడమే తప్పా? భాను కిరణ్ కాల్స్ లిస్ట్ తమ వద్ద ఉన్నాయంటూ ఆ చానల్ హల్చల్ చేయలేదా? ఆయన కాల్ లిస్ట్ బయట పెట్టలేదా? అది తప్పు కాదా?'' అని శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించారు.
సిబిఐ జెడి కాల్ లిస్టును కోర్టు నుంచి తీసుకున్నామంటూ ఒకసారి, ఆ వెంటనే పార్టీ అభిమానులు కూడా ఇచ్చారంటూ పరస్పర విరుద్ధంగా మాట్లాడారు. వాస్తవానికి, ఎవరైనా పిల్ వేస్తే, దాంతో జత చేసిన పత్రాలను కోర్టు నెంబర్ అయిన తర్వాతే ప్రతివాదులు పొందే వీలుంటుందని అంటున్నారు. ఒకవేళ సీబీఐ జెడి మీద కేసు వేస్తే.. కేసు వేసిన వారికి, ఆ కేసుకు కోర్టు నెంబర్ ఇచ్చిన తర్వాత జేడీకి సంబంధిత పత్రాలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. అయితే, సీబీఐ జేడీ కాల్ లిస్టుతో కూడిన పిల్ను ఇప్పటి వరకు ఎవరూ కోర్టులో దాఖలు చేయలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయంటూ ఓ పత్రిక రాసింది.