తెరపైకి లోకేష్ పేరు: జగన్కు జై కొట్టిన నాని
ఆ తర్వాత నుండి నేతలు ఎవరు లోకేష్ రాజకీయ ఆరంగేట్రం గురించి ప్రస్తావించినా బాబు మాత్రం వద్దని చెప్పేవారు. అయితే ఇటీవల కొద్ది రోజులుగా మరోసారి లోకేష్ పేరు ప్రధానంగా తెర పైకి వస్తోంది. చంద్రగిరి నియోజకవర్గం తెలుగు యువత నేతలు బాబును కలిసి వినతి పత్రం ఇచ్చారు. లోకేష్కు యువ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగిస్తే పార్టీ పుంజుకుంటుందని చెప్పారు. పార్టీ సీనియర్ నేతలు కూడా పలుమార్లు సమావేశాలలో లోకేష్ను తీసుకు రావాల్సిందేనని బాబుకు సూచనలు చేస్తున్నారు.
దీంతో చంద్రబాబు కూడా పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. లోకేష్ రాజకీయ ఆరంగేట్రం గురించి ఆయన ఏ క్షణమైనా ప్రకటించేందుకు సిద్ధపడ్డారనే వాదనలు వినిపించాయి. మళ్లీ లోకేష్ పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం జరుగుతుండటంతో గత కొన్నాళ్లుగా పార్టీ పైన, పార్టీ అధినేత పైన తీవ్ర అసంతృప్తితో ఉన్న నాని ఒక్కసారిగా జంప్కు సిద్ధపడ్డారు. సోమవారం ఉదయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో భేటీ అయ్యారు. ఈ విషయం తెలియగానే పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది.
కృష్ణా జిల్లాలో పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఓ వర్గం కాగా కొడాలి నాని, వల్లభనేని వంశీది మరో వర్గంగా ఉంటూ వస్తోంది. అధినేత దేవినేని ఉమకు ప్రాధాన్యత ఇస్తారనే వాదన ఉంది. నాని, వంశీలు హీరో జూనియర్ ఎన్టీఆర్ వర్గం నేతలుగా ముద్ర పడ్డారు. కొంతకాలం క్రితం బాబు, జూనియర్ల మధ్యన విభేదాలు పొడసూపిన విషయం తెలిసిందే. ఇప్పటికే బాబు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని భావిస్తున్న నాని.. జూనియర్ బాబుకు దూరం కావడం, లోకేష్ ఆరంగేట్రం చేయడం వంటి కారణాల వల్ల తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశముంటుందని భావించి జగన్కు జై కొడుతున్నారని అంటున్నారు.
2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే అభిప్రాయానికి రావడం కూడా ఆయన జంప్కు కారణం కావొచ్చునని అంటున్నారు. కాగా కొడాలి నాని ప్రభావం జిల్లా మొత్తం పడే అవకాశం లేదని అంటున్నారు. నాని వల్ల కేవలం ఆయన నియోజకవర్గంలో మాత్రమే ఈక్వేషన్లు మారతాయి, జిల్లా స్థాయిలో మార్పులు జరిగే అవకాశం లేదని అంటున్నారు. గుణదలలో కొద్దిగా ప్రభావం పడనుందని అంటున్నారు.