వైయస్సార్ పథకాలకు చంద్రబాబు ఓటు
ఫీజు రీయంబర్స్మెంట్ కోసం ఆయన ఇటీవల హైదరాబాద్ సమీపంలోని ఎల్బీ నగర్ వద్ద ధర్నా చేసి అరెస్టు కూడా అయ్యారు. వివిధ ప్రజా సమస్యలను తీసుకుని ఆందోళనలు చేపట్టడం ద్వారా ప్రజా మద్దతును సంపాదించుకోవడానికి ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు. విద్యుత్తు కోతపై తెలుగుదేశం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. తిరుపతిలో, వరంగల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికే మహాధర్నాలు నిర్వహించారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయంబర్స్మెంట్ లభించింది. విద్యార్థులందరికీ ఫీజు రీయంబర్స్మెంట్ చేస్తామని వైయస్ రాజశేఖర రెడ్డి 2008లో హామీ ఇచ్చారు. ఆయన అధికారంలోకి రాగానే దాన్ని అమలు చేయడం ప్రారంభించారు. అయితే, ఇప్పుడు కాంగ్రెసు ప్రభుత్వం అందుకు కొన్ని పరిమితులు పెడుతోంది.
విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, అవినీతిని అరికడితే విద్యార్థులందరికీ ఫీజు రీయంబర్స్మెంట్ అందించడం అసాధ్యం కాదని చంద్రబాబు అంటున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాకర్షక పథకాలకు చంద్రబాబు నాయుడు కోత పెట్టారు. అయితే, ఆ తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి ఎన్టీ రామరావు చేపట్టిన ప్రజాకర్షక పథకాలకు మరిన్ని జోడించి 2004 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. 2009లో పెద్దగా హామీలు కూడా ఇవ్వలేదు. అయితే, ఇప్పుడు చంద్రబాబు వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలకు ఓటేసి ప్రజా మద్దతు పొందడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు.