ఎన్టీఆర్ విగ్రహం: పురంధేశ్వరి హడావిడి ఉత్తదేనా?
ఎన్టీఆర్ విగ్రహం ఇవ్వడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదని, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తం కావడంతో అటువంటి అనుమతి ఏదీ ఇవ్వలేదని లోకసభ స్పీకర్ సచివాలయం చెప్పినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. స్పీకర్ మీరా కుమార్ నుంచి తనకు లేఖ అందిందని పురంధేశ్వరి నుంచి చెప్పుకుంటున్నారు. అయితే, తమ కార్యాలయం నుంచి రెండు నెలల క్రితం ఎన్టీఆర్ విగ్రహ ప్రతస్థాపన కోసం కుటుంబ సభ్యుల అనుమతితో ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీకి, పురంధేశ్వరికి లేఖలు రాసినట్లు తమకు స్పీకర్ కార్యాలయ వర్గాలు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.
ఎన్టీ రామారావు విగ్రహాన్ని పార్లమెంటులో నెలకొల్పడానికి స్పీకర్ కార్యాలయం సిద్ధంగానే ఉంది. అయితే, ఎన్టీఆర్ కుమారులు ఏడుగురు, కూతుళ్లు నలుగురు - మొత్తం 11 మంది సంతానం ఏకాభిప్రాయంతో రావాలని స్పీకర్ సచివాలయం అడిగింది. అయితే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు పది మంది ఎన్టీఆర్ సంతానం ఒక వైపు ఉండగా, కూతురు పురంధేశ్వరి మరో వైపు ఉన్నారు. పార్లమెంటులో విగ్రహ ప్రతిష్టాపన ప్రతిష్ట ఎవరికి దక్కాలనే విషయంపై రెండు గ్రూపుల మధ్య వివాదం నడుస్తోంది.
ఎవరో ఒక్కరికి అనుమతి ఇచ్చే ప్రశ్న లేదని, కుటుంబ సభ్యులందరి సంతకాలతో ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీకి, పురంధేశ్వరికి గతంలో లేఖలు రాసినట్లు తెలుస్తోంది. అటువంటి అనుమతితో ఎవరూ ముందుకు రాలేదని స్పీకర్ కార్యాలయానికి రాలేదని ఆ పత్రిక రాసింది. అయితే, రెండు విగ్రహ నమూనాలతో పురంధేశ్వరి స్పీకర్ కార్యాలయానికి వచ్చారని అంటున్నారు. మొత్తం మీద, పార్లమెంటులో విగ్రహ ప్రతిష్టాపన వివాదం పతాక స్థాయికి చేరుకున్నట్లే ఉంది.