విజయమ్మకు కౌంటర్: ప్రచారానికి పరిటాల సునీత

పరిటాల సునీత సరైన సమయంలో సరైన అంశాలను లేవనెత్తారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయని తెలుస్తోంది. తమ కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయాలని విజయలక్ష్మి తలపెట్టడం తెలిసిందే. అయితే, జగన్ వెనుక చాలా నేర చరిత్ర ఉందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పరిటాల రవి హత్య వ్యవహారం బాగా ఉపయోగపడుతుందని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.
ఈ విషయాన్ని సునీత ద్వారానే చెప్పిస్తే ప్రజల్లోకి బాగా వెళ్తుందని, ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో ఆమెతో ప్రచారం చేయించాలని కొందరు నేతలు అధిష్టానానికి సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఇచ్చిన నివేదికను ఈ ప్రచారంలో వినియోగించుకోవాలని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. పరిటాల రవి హత్యలో పులివెందుల కృష్ణ పాత్రపై ఈ నివేదికను సిబిఐ రూపొందించింది.
జగన్ ఆశీర్వాదంతోనే కృష్ణ.. ఆయుధాలు, ఇతర వనరులను పరిటాల హంతకులకు అందించినట్లు కనిపిస్తోందని అందులో సిబిఐ పేర్కొంది. సునీత నోరు తెరిస్తే ప్రజలకు గతం గుర్తుకు వస్తుందని, జగన్ నేరచరిత్ర వెలుగులోకి వస్తుందని, అందుకే ప్రచారంలో సునీతను వినియోగించుకోవడంపై టిడిపి వర్గాలు ఆలోచిస్తున్నాయని తెలుస్తోంది. ఇదే సమయంలో వాన్పిక్, కాకినాడ సెజ్, గంగవరం పోర్టు, లేపాక్షి నాలెడ్జి పార్కు వంటి చోట్ల భూములు పోగొట్టుకొన్న రైతులు, విశాఖ బాక్సైట్ గనులను వ్యతిరేకిస్తున్న గిరిజనులు, సెజ్ల కింద నిరాశ్రయులైన మత్స్యకారులు, ఆయేషా మీరా కుటుంబ సభ్యులు తదితరులను తెరముందుకు తెచ్చే కసరత్తు చేస్తున్నారు.
కాగా పరిటాల రవి హత్యపై పునర్విచారణ కోరుతూ ఆయన సతీమణి సునీత బుధవారం అనంతపురంలో దీక్ష చేపడుతున్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. 2004 ఎన్నికల తరువాత అప్పటి సిఎం వైయస్ తన భర్తను అడుగడుగునా వేధించారని చెప్పారు. వైయస్తో పాటు ఆయన కొడుకు జగన్ కూడా రాజకీయ కక్ష కట్టి హత్యకు పథకం పన్నారని అప్పట్లోనే ఆరోపణలొచ్చాయని... జగన్ తన అనుచరుడు దంతలూరి కృష్ణ సహకారంతో మద్దెలచెరువు సూరిని జైల్లో పలుసార్లు కలిశారని ఆమె వివరించారు. కృష్ణ ద్వారా సూరికి ఆర్థిక సాయం అందించినట్లు పోలీస్ రికార్డుల్లో కూడా నమోదయిందని సునీత గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications