ప్రణబ్తో భేటీ: విజయమ్మను నిలదీసిన సొంతపార్టీ!
పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చాక ముఖ్యనేతల బృందం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలుసుకోవాలని అనుకున్నామని, కానీ సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించిన వెంటనే ఢిల్లీ వెళ్లడంతో ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్లాయని పలువురు అభిప్రాయపడ్డారట. అయితే దీనిపై నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వివరణ ఇవ్వడంతో ప్రశ్నించిన వారు మారుమాట్లాడలేదని సమాచారం.
బుధవారం జరిగిన పార్టీ భేటీలో నేతల మధ్య ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదట. షర్మిల చేత పాదయాత్ర అని, రథయాత్ర అని, ఓదార్పు యాత్ర అని పలువురు నేతలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ కారణంగానే షర్మిల యాత్ర ఏ తరహాదో తేల్చడానికి గురువారం మరోసారి భేటీ కానుంది. పార్టీ కేడర్ను 2014 ఎన్నికల వైపు నడిపించటం లక్ష్యంగా, ప్రజా సమస్యలు అజెండాగా జనంలోకి వెళ్లడం మంచిదనే విషయంలో మాత్రం అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇటీవల ఉప ఎన్నికల ప్రచారంలో షర్మిల ప్రసంగాలకు మంచి స్పందన రావడం, ఆమె హావభావాలు, మాట తీరు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని పోలి ఉండటంతో ముఖ్య నేతలంతా షర్మిలతో పాదయాత్ర చేయించాలని నిర్ణయించారు. కాగా, గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి కొండా సురేఖ.. బుధవారం నాటి భేటీకి ఆలస్యంగా హాజరయ్యారు. షర్మిల యాత్ర పైన ఈ రోజు పూర్తి క్లారిటీ రానుంది!