ఆజాద్, కిరణ్‌లకు షాక్: చక్రం తిప్పిన బొత్స

Botsa Satyanarayan - Kiran Kumar Reddy
రాజ్యసభలో తమకు దక్కే నాలుగు స్థానాల కోసం కాంగ్రెస్ తమ తమ అభ్యర్థులను ఆదివారం రాత్రి ప్రకటించాయి. అందరూ ఊహించినట్లుగానే చిరంజీవికి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యత్వం దక్కింది. ప్రజారాజ్యం విలీనం సందర్భంగా చిరంజీవికి ఇచ్చిన మాట మేరకు ఆయనకు పెద్దల సభ అవకాశాన్ని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కల్పించారు. అంచనాలకు అనుగుణంగానే రేణుకా చౌదరి పేరునూ కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. మిగిలిన రెండు స్థానాల విషయంలో మాత్రం అందరి అంచనాలకూ భిన్నమైన పేర్లను ఖరారు చేసింది. హైకమాండ్‌కు వీర విధేయుడిగా పేరున్న తెలంగాణకు చెందిన సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి అవకాశం కల్పించింది. కోట్లాది రూపాయల ముడుపులతో రాజ్యసభ సీట్లను దక్కించుకునేందుకు పలువురు సిద్ధంగా ఉన్న విషయం వార్తల్లో రావడంతో సోనియా రంగంలోకి దిగి సరైన సంకేతాలు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. పత్రికాధిపతి వెంకట్రామిరెడ్డికి పోటీగా మరో పత్రికాధిపతి గిరీశ్ సంఘీ రంగంలోకి దిగడంతో వీరిద్దరికీ ఇవ్వకూడదని సోనియా నిర్ణయించారు. పిసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ జర్నలిస్ట్ అయిన రాపోలు ఆనంద భాస్కర్ అభ్యర్థిత్వాన్ని కూడా హైకమాండ్ చివరి నిమిషంలో ఖరారు చేసింది.

తెలంగాణ నుంచి కె కేశవరావు స్థానంలో మరో బిసి నేత గురించి అధిష్ఠానం ఆరా తీయడంతో కాసాని జ్ఞానేశ్వర్, ఆనంద భాస్కర్ పేర్లు ముందుకు వచ్చాయి. కాసానికి చాలా పార్టీలు పెట్టిన నేపథ్యం ఉన్నందు వల్ల ఆనంద భాస్కర్‌కు అవకాశం ఇవ్వాలని సోనియా నిర్ణయించారు. మర్రి చెన్నారెడ్డి హయాంలో ఎంపిక చేసిన ప్రగడ కోటయ్య తర్వాత గత 20 సంవత్సరాలుగా చేనేత వర్గాలకు చెందిన నేతనెవరినీ కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎంపిక చేయలేదన్న విషయాన్ని అధిష్ఠానం దృష్టికి బొత్స తీసుకువెళ్లడంతో సామాన్య పద్మశాలీ కుటుంబానికి చెందిన ఆనంద భాస్కర్‌కు పెద్దల సభకు వెళ్లే అవకాశం లభించింది. కాగా, కర్ణాటకకు చెందిన హరి ప్రసాద్‌కు మన రాష్ట్రం నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించాలని హైకమాండ్ తొలుత భావించినా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చక్రం తిప్పారు. కాంగ్రెస్‌కు దక్కే నాలుగు స్థానాలనూ మన రాష్ట్రానికి చెందిన నేతలకే ఇచ్చేలా హైకమాండ్‌ను ఒప్పించగలిగారు. ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన రషీద్ అల్వీ స్థానంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌కు అత్యంత సన్నిహితుడైన షబ్బీర్ అలీకి అవకాశం దక్కుతుందని పలువురు భావించినప్పటికీ ఈ విషయంలో ఆజాద్ మాట చెల్లుబాటు కాలేదని తెలుస్తోంది.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపాదించిన సురేశ్ రెడ్డి, రఘురామి రెడ్డిల పేర్లను కూడా సోనియా నిరాకరించినట్లు తెలుస్తోంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఇచ్చిన మాటకు కట్టుబడటం, విధేయతకు పట్టం కట్టడంతో పాటు సామాజిక సమీకరణల కూర్పునకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. కెకెకు మరోసారి ఇవ్వాలని తెలంగాణ నేతలు పలువురు అధిష్టానాన్ని కోరినప్పటికీ అది ఫలించలేదు. సంజీవ రెడ్డికి కూడా రెండోసారి అవకాశం దక్కుతుందని అందరూ భావించారు. కానీ అధిష్టానం మాత్రం అందరి అంచనాలు తలక్రిందులు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+