మేనత్త భయంతోనే క్యాబినెట్లోకి ఇందిరా గాంధీ
నెహ్రూ రాజకీయ వారసత్వాన్ని మేనత్త విజయలక్ష్మి పండిట్ ఎక్కడ తన్నుకుపోతుందోనన్న భయాందోళనే ఇందిరను కేంద్ర మంత్రిని చేసిందని జయ్ చెబుతున్నారు. యూనివర్సల్ లా పబ్లిషింగ్ కో సంస్థ ప్రచురించిన స్ట్రోక్స్ ఆన్ లా అండ్ డెమోక్రసీ గురువారమిక్కడ విడుదలైంది. ఇందిర రాజకీయ జీవితంలోని పలు ఘట్టాలు ఇందులో పొందుపరిచారు. ఒకవేళ ఇందిర అంగీకరించకపోతే.. విజయలక్ష్మి పండిట్ను కేబినెట్లోకి తీసుకోవాలని శాస్త్రి భావించారని జయ్ విశ్లేషించారు.
నెహ్రూ అస్థికలను అలహాబాద్ నదిలో కలిపేసి వచ్చిన వెంటనే శాస్త్రి నుంచి ఇందిరకు ఆహ్వానం అందించిందని ఆయన వివరించారు. ఆ ఘట్టానికి తానే సాక్షినని జయ్ తన పుస్తకంలో వివరించారు. " శాస్త్రి, ఇందిర అలహాబాద్ నుంచి ఢిల్లీకి కలిసి ప్రయాణించారు. అప్పటికే ఆయన ప్రధానమంత్రి. తన మంత్రివర్గంలో చేరాలంటూ హఠాత్తుగా శాస్త్రి ప్రతిపాదించారు. అప్పటిదాకా ప్రశాంతవదనంతో ఉన్న ఇందిర ముఖం ఒక్కసారిగా జేగురించింది. తండ్రి పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న సమయంలో అలా అడిగేసరికి ఆమె తట్టుకోలేకపోయింది. శాస్త్రిపై విరుచుకుపడింది. చెడామడా వాయించేసింది" అని రాశారు.
"ఆ తరువాత ఆయనను దాటుకొని పెద్ద పెద్ద అంగలతో ముందుకు వెళ్లిపోయింది. మరొకరు చూస్తుండగా (రచయిత) ఇలా జరిగినందున తప్పక శాస్త్రి మనస్తాపం చెంది ఉండాలి'' అని వివరించారు. లాల్ బహదూర్కు చీవాట్లు పెట్టిన ఇందిరా గాంధీ ఆ తరువాత కొద్ది రోజులకే ఆయన కేబినెట్లో చేరిపోయారు.
ఈ పరిణామం ఎలా జరిగిందనేదీ జయ్ మాటల్లోనే " ఇందిర అలా వెళ్లిపోయిన కొద్దిసేపటికి శాస్త్రి తేరుకున్నారు. ఇందిర అంగీకరించనట్టయితే విజయలక్ష్మిని కేబినెట్లో తీసుకోవాల్సి ఉంటుంద''ని తనలో తానే గొణుక్కున్నారు. ఆ విషయాన్ని నేను ఇందిర చెవిన వేశాను. మంత్రి పదవికి ఇందిర అన్నివిధాల అర్హురాలని భావించాను. ఎప్పుడైతే విజయలక్షి పేరు విన్నారో ఇందిర వైఖరి అనూహ్యంగా మారిపోయింది. శాస్త్రిని కలిసేందుకు ఏర్పాటు చేయాలని నన్ను ఆమె కోరారు. స్వయంగా ఆమే శాస్త్రిని ఫోన్ చేశారు "మీ కేబినెట్లో చేరడం ఎంతో సంతోషదాయకం'' అంటూ తన సమ్మతిని తెలిపారు. అప్పటి నుంచి శాస్త్రి మరణించేవరకు ఇందిర సమాచార, ప్రచార మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహించారు'' అని పేర్కొన్నారు.
జయ్ తొలుత నెహ్రూ కార్యాలయంలో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆ తరువాత ఇందిర ఆంతరంగికుల్లో ఒకరిగా మెలిగారు. అనంతర కాలంలో ఆమెతో చెడి, ఇందిరను చెడామడా విమర్శించారు. ఇలా అనేక ఒడిదొడుగుల మధ్య సాగిన తన రాజకీయ, న్యాయజీవితంలో చోటుచేసుకున్న అనేక పరిణామాలు, కలుసుకున్న వ్యక్తుల గురించి పిట్టకథల్లా ఈ పుస్తకంలో చెప్పుకొచ్చారు.
అలాంటి కథలు కొన్ని ఇలా ఉన్నాయి -
- అమితాబ్ బచ్చన్ ఉద్యోగార్థం ఇందిరను కలిశారు. ఆయన కోసం అప్పటి బెంగాల్ గవర్నర్ పద్మజా నాయుడుకు లేఖ రాయాల్సిందిగా నన్ను ఇందిర కోరారు. బెంగాల్లో ఎక్కడైనా తగిన ఉద్యోగం అమితాబ్కు ఇప్పించాలనేది ఆ లేఖ సారాంశం. ఫలితంగా అమితాబ్ కలకత్తాలో తొలి కొలువులో చేరారు.
- కూతురు ఇందిరకు, అల్లుడు ఫిరోజ్కు మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలను తొలగించి సఖ్యత కుదిర్చేపనిని నెహ్రూ ఎమ్వో మథాయ్కు అప్పగించారు. ఇది ఆయన చేసిన అతిపెద్ద తప్పిదం. నెహ్రూ అప్పగించిన పని మథాయ్ పెద్దగా పట్టించుకోలేదు. దంపతుల మధ్య పొరపొచ్చాలు తొలగించడానికి నిజాయితీగా ప్రయత్నించలేదు.
- సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండోసారి రాష్ట్రపతి కాకుండా ఇందిర అడ్డుకున్నారు. జాకీర్ హుస్సేన్ పేరును చిన్నగా తెరపైకి తెచ్చారు. నిజానికి, ప్రధానిగా ఇందిరను తీర్చిదిద్దిన ప్రముఖుల్లో సర్వేపల్లి ముఖ్యులు.