తెలంగాణకు టైమొచ్చిందా: దెబ్బకు రెండు పిట్టలు

తెలంగాణను గట్టిగా వ్యతిరేకించే సీమాంధ్ర నేతలలో లగడపాటి, టిజి వెంకటేష్ ముందుగా ఉంటారు. అలాంటి నేతల వ్యాఖ్యలు ఇప్పుడు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని గట్టిగా చెప్పిన టిజి వెంకటేష్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన ఇప్పుడు ఆఖరి ఘట్టంలో ఉందని, అన్ని పార్టీలు తెలంగాణపై నిర్ణయం చెప్పాయని, కాంగ్రెసు పార్టీ మాత్రమే చెప్పాల్సి ఉందని, అది కూడా చెబితే తమ పార్టీ తీసుకునే నిర్ణయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు.
అంతేకాకుండా.. ఉప ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కేంద్రం తెలంగాణ ఇస్తుందేమో అనే భయం కలుగుతోందన్నారు. కేంద్రం తెలంగాణ ఇవ్వాలనుకుంటే రాయలసీమ నేతలకు ముందుగా చెప్పాలని, తమ ప్రాంతకు న్యాయం జరిగాకే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని, అర్ధరాత్రి నిర్ణయాలు, ప్రకటనలు ఉండవద్దని కోరారు. కేంద్రం తెలంగాణ ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెసులో విలీనమయ్యే అవకాశాలున్నాయని... తెరాస విలీనం, తమ ప్రాంత అభివృద్ధి పైన స్పష్టమైన హామీ వచ్చాక తాము తెలంగాణపై పునరాలోచిస్తామని చెప్పారు.
గట్టి సమైక్యవాది అయిన టిజి వెంకటేష్ తెలంగాణపై పునరాలోచిస్తామని చెప్పడం గమనార్హం. ఇక లగడపాటి రాజగోపాల్ ఉప ఎన్నికలకు ముందే బాంబు పేల్చారు. జగన్ అరెస్టు సానుభూతి, వైయస్ విజయమ్మ, షర్మిలల ప్రచారం, వైయస్ పైన అభిమానం తదితర కారణాల వల్ల జగన్ పార్టీయే ఉప ఎన్నికలలో ఘన విజయం సాధిస్తుందని అందరూ ముందే ఊహించారు. అలాంటప్పుడు లగడపాటి... జగన్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం విడిపోయే అవకాశాలు మెండు అని చెప్పారు.
జగన్ కారణంగా సీమాంధ్రలో కాంగ్రెసు దారుణంగా తుడిచి పెట్టుకు పోయింది. తెలంగాణ ఇస్తే సీమాంధ్ర నేతలు ఎక్కడ రాజీనామాలు చేస్తారో అనే భయంతో ఇన్నాళ్లూ కాంగ్రెసుకు తెలంగాణకు నో చెప్పింది! ఇప్పుడు సీమాంధ్రలో కాంగ్రెసు పరాజయం నేపథ్యంలో కనీసం తెలంగాణలో అయినా పార్టీని కాపాడుకునే దృష్టితో కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో కూడా కాంగ్రెసు అధమ స్థానానికి దిగజారింది. అయితే తెలంగాణ ప్రకటిస్తే ఆ క్రెడిట్ కాంగ్రెసుకే దక్కుతుంది. దీంతో తెలంగాణవ్యాప్తంగా కాంగ్రెసు జోరుగా పుంజుకుంటుంది. జగన్ పార్టీ పరకాలలో రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణకు అనుకూల ప్రకటన చేయడం ద్వారా ఆ ప్రాంతంలో కాంగ్రెసు బలం పుంజుకోవడంతో పాటు జగన్ పార్టీ ఆ ప్రాంతంలో విస్తరించకుండా చెక్ చెప్పినట్లవుతుందని అధిష్టానం భావిస్తోందని అంటున్నారు.
ఇక తెలంగాణ ప్రకటించినా ప్రకటించకపోయినా సీమాంధ్రలో కాంగ్రెసు పరిస్థితి ఇప్పుడున్న దానికంటే దారుణంగా ఏమీ పడిపోదు! ఇలాంటి పరిస్థితుల్లోనే తెలంగాణ ప్రకటించి తెలంగాణలో పుంజుకోవడంతో పాటు సీమాంధ్రలోనూ 2014 నాటికి క్రమంగా ఎదగాలని కాంగ్రెసు భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. రెండు కళ్ల సిద్ధాంతం ప్రవచిస్తున్న తెలుగుదేశం పార్టీని రెండు ప్రాంతాలలోని ప్రజలు నమ్మె పరిస్థితి లేదని, అది తమకే లాభిస్తుందని కాంగ్రెసు భావిస్తుండవచ్చునని అంటున్నారు.
తెలంగాణ ప్రకటన ద్వారా ఆ ప్రాంతంలో ఒక్కసారిగా పుంజుకోవడం, జగన్ పార్టీని ఆ ప్రాంతంలో అడుగిడకుండా అడ్డుకోవడం, సీమాంధ్రలో మెల్లిగా ఎదగడం, తెలుగుదేశం పార్టీని ఇరు ప్రాంతాలలో దెబ్బతీయడం... ఇలా ఒక్క దెబ్బకు అన్న చందంగా కాంగ్రెసు యోచిస్తుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications