కొత్త సిఎంపై సోనియా ఆరా, ఇక కిరణ్ ఇంటికేనా?
సిఎం కిరణ్ను తక్షణం మార్చాల్సిందేనని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కిరణ్ ఇలానే కొనసాగితే కాంగ్రెస్ మనుగడకే ప్రమాదమని ఆయన అన్నారు. ఎన్నికల్లో టీం ఓడిపోయినందున కెప్టెన్ను మార్చాల్సిందేనని మాజీ మంత్రి శంకర్ రావు డిమాండ్ చేశారు. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కిరణ్పై మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఆ తరువాత పిఆర్పీ మంత్రులు సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావు కూడా భేటీ అయ్యారు. మరో వైపు డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహతోనూ పెద్దిరెడ్డి భేటీ అయ్యారు. షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక విషయమై డిప్యూటీ సిఎం తన చాంబర్లో ఎస్సీ, ఎస్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఈ సమావేశంలోనూ సిఎం తీరుపై కొందరు సభ్యులు అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ సిఎం మొదలుకొని మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు వరకు సిఎంగా కిరణ్ కొనసాగితే పార్టీ మనుగడే ప్రమాదంలో పడుతుందని ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో సిఎం అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీ ఇప్పటికే రెండుగా చీలింది. అధిష్ఠానం కూడా కిరణ్ వ్యవహార శైలిపట్ల తీవ్ర అసంతృప్తితో ఉంది. తరచూ ముఖ్యమంత్రులను మార్చకూడదన్న విధానంతో ఉన్న సోనియా ఆలోచనలోనూ కిరణ్ విషయంలో మార్పు వచ్చిందని అంటున్నారు. త్వరలో జరగబోయే 18 శాసనసభా సెగ్మెంట్ల ఎన్నికల్లో తాజా ఉప ఎన్నికల ఫలితాలే వెలువడితే రాష్ట్రంలో కాంగ్రెస్ నామ రూపాలు లేకుండా పోతుందన్న భయం అధిష్ఠానాన్ని పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి సంక్షోభాలను నివారించేందుకు కఠిన చర్యలను తీసుకోవడమే మందుగా అధిష్ఠానం భావిస్తోందని పార్టీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది? ఏ ప్రాంతానికి చెందిన వారైతే బాగుంటుంది? అంటూ అధిష్ఠానం ఆరా తీస్తోందని సమాచారం. దీంతో కాంగ్రెస్ నేతలు పలువురు తమ వాదన వినిపించేందుకు హస్తినకు వెళుతున్నారట. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఢిల్లీ వెళ్లాలని రాజనరసింహ నిర్ణయించుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, డీఎల్ రవీంద్రా రెడ్డి కూడా ఇదే ఉద్దేశంతో ఉన్నారు.