దిద్దుబాట: వైయస్ కుటుంబంపై ఎదురుదాడే
గతంలో మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, కొండ్రు మురళీలు జగన్ కేసుకు సంబంధించి వైయస్ కుటుంబంపై ధ్వజమెత్తిన సమయంలో సొంత పార్టీ నుండి భిన్న వాదనలు వినిపించాయి. కొందరు వారికి మద్దతు పలుకగా వైయస్ను ఏమైనా అంటే పార్టీకి నష్టమని విమర్శించారు. అయితే, క్రమంగా వైయస్ను వెనుకేసుకు వచ్చే వారు తగ్గుతున్నట్లుగా కనిపిస్తోంది. వైయస్ను విడిచి పెడితేనే కాంగ్రెసుకు లాభమనే అభిప్రాయానికి కాంగ్రెసు వచ్చినట్లుగా తెలుస్తోంది.
అందుకే గతంలో వైయస్ను ఏమైనా అంటే సొంత పార్టీ నుండే తీవ్ర విమర్శలు వచ్చేవి. కానీ, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలను చాలామంది ఇప్పుడు సమర్థిస్తున్నారు. ఒకవేళ ఆ వ్యాఖ్యలతో విభేదించే వారు సైతం మౌనం వహిస్తున్నారే తప్ప వ్యతిరేకించక పోవడం గమనార్హం. గతంలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రి చిరంజీవిలు జగన్ పైన విమర్శలు చేస్తే కేవలం రాజకీయ విమర్శలుగానే మిగిలిపోయాయి.
ఆనం తన విమర్శలతో కాంగ్రెసులో కొత్త వేడి పుట్టించారు. తెర వెనుక బాగోతాల గురించి వైయస్ తమకు చెప్పలేదని, జగన్ దోపిడీకి ఆయనే సహకరించినట్లు ఆనం చెప్పినా పార్టీ నేతల నుంచి ఎలాంటి ప్రతిఘటనా కన్పించలేదు. ఆనం వ్యాఖ్యలకు సొంత పార్టీ నేతల నుండి వచ్చిన సమర్థన చూస్తుంటే వైయస్ను మర్చిపోవాలనే అభిప్రాయానికి కాంగ్రెసు వచ్చినట్లుగా కనిపిస్తోంది. పార్టీ అధిష్టానం కూడా జగన్పై ఎదురుదాడికి ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటుందంటున్నారు.