షర్మిల, విజయమ్మ టూర్: బయటకెళ్తున్న లీడర్స్!
ఇతర జిల్లాలకు చెందిన పలువురు సీనియర్ నేతలు కూడా పార్టీ పట్ల అసంతృప్తితో ఉంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఓ వైపు పంచాయతీ ఎన్నికలలో సత్తా చాటాలని పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. షర్మిల కూడా మరో ప్రజా ప్రస్థానం పేరుతో పార్టీలో ఉత్సాహం నింపుతున్నారు. ఇదే సమయంలో ఆయా జిల్లాల్లో అసంతృప్తుల బెడద ఎక్కువవుతుండటం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
తెలంగాణలో పార్టీ సీమాంధ్రలో ఉన్నంత బలంగా లేకపోవడంతో విజయమ్మ పదిరోజుల పాటు తెలంగాణ జిల్లాల్లో గత నెల 25 నుండి పర్యటిస్తున్నారు. అయితే ఆమె పర్యటనకు ముందు, పర్యటన చేస్తుండగానే తెలంగాణ జిల్లాల్లో షాక్ తగిలింది. గత నెలలో అదిలాబాద్ జిల్లాకు చెందిన సోయం బాబురావు, బోడ జనార్ధన్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెసు పార్టీలో చేరారు. గుంటూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు అయిన మాకినేని పెదరత్తయ్య చేరిన కొన్నాళ్లకే పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత పార్టీకి దూరమై ఇప్పుడు కాంగ్రెసు పార్టీలే చేరేందుకు సిద్ధమయ్యారు.
ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత జలగం వెంకట్రావు కూడా అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన కాంగ్రెసు పార్టీలో చేరుతారని సమాచారం. ఖమ్మం లోకసభ టిక్కెట్ పైన జగన్ నుండి హామీ లేకపోవడం వల్లనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కీలక నేతలు రెండు రోజుల క్రితం తాము పార్టీ వీడుతామని చెప్పిన విషయం తెలిసిందే. ఇదే జిల్లాకు చెందిన రాష్ట్ర నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి నేతలను సమన్వయం చేయడంలో విఫలమవుతున్నారని అంటున్నారు.
వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు పలు నియోజకవర్గాలలో ఇప్పటికే ఆ పార్టీ తరఫున అభ్యర్థులు ఖరారయ్యారు. దీంతో టిక్కెట్ ఆశించిన వారి తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో నేతలు ఒకే సామాజిక వర్గం నుండి పార్టీలోకి వస్తున్నారట. ఇది కూడా ఇబ్బందిగా మారిందని అంటున్నారు. మరోవైపు పార్టీ కార్యక్రమాలకు అధిష్టానమే ఖర్చు పెడుతుందనే అభిప్రాయంతో పార్టీలో చేరుతున్న వారు ఉన్నారట. అయితే పార్టీ ఖర్చు పెట్టదని తెలియడంతో సెకండ్ గ్రేడ్ లీడర్స్ వీడుతున్నారట.