హేట్ స్పీచ్: అక్బరుద్దీన్పై వేటు, రాకపోతే..?
అక్బరుద్దీన్ ద్వేషపూరిత ప్రసంగంపై నాదెండ్ల మనోహర్ కూడా సీరియస్గా ఉన్నట్లు అర్థమవుతోంది. అక్బరుద్దీన్పై తనకు వివిధ కోణాల నుంచి ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలిస్తున్నానని ఆయన చెప్పారు. అక్బరుద్దీన్పై అనర్హత వేటు పడుతుందనే మాట ఆయన స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ అటువంటి సంకేతాలు ఇచ్చారని అంటున్నారు.
నైతిక కోణంలో అక్బరుద్దీన్పై చర్యలు తీసుకునే విషయాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవలసి ఉందని కూడా ఆయన అన్నారు. శాసనసభ సమావేశాలు జరగని సమయంలో స్పీకర్కు చెప్పకుండా ఎమ్మె ల్యేలను అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉన్నదని, ఆ తర్వాత సమాచారం అందిస్తే సరిపోతుందని ఆయన స్పష్టం చేశారు.
అక్బర్పై 121, 153, 153 (ఎ), 295(ఎ) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వీటిలో 121 కింద నేరు నిరూపితమవుతే జీవిత ఖైదు, 153 (ఎ) కింద నిర్ధారణ అయితే మూడేళ్ళ జైలు శిక్ష ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ నెల 8, 9 తేదీలలో నిజామాబాద్, నిర్మల్ కోర్టులకు హాజరు కావాలని ఇప్పటికే అక్బరుద్దీన్కు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం వైద్యం పేరుతో అక్బరుద్దీన్ లండన్లో ఉన్నారు.
ఒకవేళ బిజెపి డిమాండ్ను ఆమోదిస్తూ స్పీకర్ కనుక అక్బరుద్దీన్ ఒవైసీపై అనర్హత వేటు వేస్తే అది రాష్ట్ర చరిత్రలో మొట్ట మొదటిదవుతుంది. గతంలో అనర్హత పాలైన ఎమ్మెల్యేల కేసులన్నీ రాజకీయ పరమైనవైతే అక్బర్ కేసు అందుకు భిన్నమైంది. మత వైషమ్యాలను రెచ్చగొట్టారన్న తీవ్రమైన అభియోగాన్ని ఎదుర్కుంటున్న ఒక శాసనసభ్యుడిని అనర్హుడుగా ప్రకటిస్తే నిజంగా ఆ రికార్డు స్పీకర్ నాదెండ్ల దక్కుతుంది.
స్పీకర్ అభిప్రాయం మేరకు లండన్ నుంచి అక్బర్ తిరిగి వచ్చిన పక్షంలో ఆయనను పోలీసులు నేరుగా అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆయనపై నమోదు చేసిన కొన్ని సెక్షన్లు నాన్ బెయిలబుల్కు సంబంధించినవి ఉన్నాయి. దాంతో అక్బరుద్దీన్ను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలున్నాయి. ఇటీవల మరణించిన శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ థాకరే విషయంలో గతంలో ఇలాంటి నిర్ణయం వచ్చింది. మహారాష్ట్ర లో హిందువులు, ముస్లింల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కారకుడ వుతున్నారన్న ఆరోపణపై బాల్ థాకరేపై ఐదేళ్ళపాటు (ఒకసారి పూర్తి శాసనసభ పదవీకాలం) పోటీ చేయకుండా అప్పట్లో నిషేధం విధించారు.
ఇదిలా వుంటే, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, అక్బర్ సోదరుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ ఇతర ఎమ్మెల్యేలు, అగ్ర నేతలు అక్బరుద్దీన్ వ్యవహారంపై కంగు తిన్నట్లు కనిపిస్తోంది. అసదుద్దీన్ ఇరకాటంలో పడినట్లు కనిపిస్తున్నారు. కోర్టులంటే తమకు గౌరవం ఉందని, న్యాయపోరా టం సాగిస్తామని చెప్పారే తప్ప మరో మాట ఆయన మాట్లాడలేదు.
కాగా, అక్బర్పై కేసు రోజురోజుకూ జటిలం అవుతుండటంతో ప్రస్తుతం లండన్లో ఉన్న ఆయనను వెంటనే స్వదేశానికి రప్పించాలా లేక ముందస్తు బెయిల్ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాక రప్పించాలా అనే విషయంపై పార్టీ నేతలు చర్చలు చేస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్, నిర్మల్ కోర్టుల ఆదేశాల మేరకు అక్బర్ కోర్టులకు హాజరు కాకపోతే అది మరో ఇబ్బంకి దారి తీసే అవకాశం ఉంది. అనారోగ్యం సాకు చూపి స్వదేశానికి రావటంలో అక్బర్ ఆలస్యం చేస్తే ఇంటర్పోల్ సహాయం తీసుకుంటామన డిజిపి దినేశ్రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
అక్బర్ ఒకవేళ కోర్టుకు హాజరు కాకపోతే కోర్టు ధిక్కారం కిందకు వచ్చి మరో ఇబ్బందికర పరిస్థితికి దారి తీస్తుందని, అలా కాకుండా వెంటనే స్వదేశానికి వచ్చి కోర్టుకు హాజరైతే కనీసం చట్టాన్ని గౌరవించారన్న గుర్తింపు అయినా మజ్లిస్ పార్టీకి మిగులుతుందని కొందరు నేతలు వ్యాఖ్యానించారు. అసదుద్దీన్తో సమావేశమైన పలువురు మజ్లిస్ సీనియర్ నేతలు అక్బర్ను స్వదేశానికి రప్పించటమే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.